Brs chief kcr: బండి సంజయ్ పైసా పనిచెయ్యలే!
బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పైసా పని చెయ్యలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.
నలుగురు బీజేపీ ఎంపీలు.. నాలుగు రూపాలు తేలే
కాంగ్రెస్ ఒక్క హామీని అమలు చేయలే
ఎంపీ ఎలక్షన్ తర్వాత సర్కారు ఉంటదో ఊడుతదో
దమ్ముంటే చేయగలిగిందే చెప్పాలే
వినోద్ గెలుపు ఇప్పటికే ఖాయమైంది
కరీంనగర్ కార్నర్ మీటింగ్లో కేసీఆర్
తెలంగాణం, కరీంనగర్ : బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పైసా పని చెయ్యలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు పార్లమెంటులో మాట్లాడొస్తదా..? అని ప్రశ్నించారు. ఆయన గట్టిగా మాట్లాడితే హిందీ మాట్లాడుతున్నాడో, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో తెలియక మనమే సావాలని.. మనకే అర్థం కాక పోతే పార్లమెంట్లో వాళ్లకి అర్థం అయితదా..? అని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో బండి సంజయ్తో పైసా పని కాలేదని.. ఎంపీగా గెలిచి చేసిందేమీ లేదని మండిపడ్డారు. న్యాయవాది, ఉద్యమాల బిడ్డ, తెలంగాణ ఆకాంక్షలు తెలిసిన వినోద్ కుమార్ను గెలిపించాలని కేసీఆర్ కోరారు. గతంలో గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు నాలుగు రూపాయలు అయినా తెచ్చారా..? అని ప్రశ్నించారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్ అన్నారు. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు తనతో కొట్లాడి రూ.2వేల కోట్లు తెచ్చి ప్రతి రోడ్డును సుందరంగా తీర్చిదిద్దింది గంగుల కమలాకర్ అని చెప్పారు. ఉద్యమ కార్యకర్త వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. తన దగ్గర ఉన్న సర్వేల ప్రకారం వినోద్కుమార్ ఇప్పటికే 8 శాతం ముందంజలో ఉన్నారని చెప్పారు. వినోద్కుమార్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని చెప్పారు. దమ్ముంటే చేయగలిగిందే చెప్పాలని కాంగ్రెస్ కు హితవు పలికారు. రైతుబంధు ఇస్తానని ఎన్నికలప్పుడు చెప్లేదని, కానీ రైతులకు కావాలని తర్వాత అమలు చేశామన్నారు. వడ్లు తడిసిపోయినా కొన్నామని రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. ఆ హామీలు అమలు అయ్యే పరిస్థితి కూడా లేదనిని అన్నారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటదో.. ఊడుతదో.. ఏం జరుగుతదో తెలియదని వ్యాక్యానించారు. పొలం దున్నేటోళ్లకే రైతు బంధు ఇస్తానని అంటున్నాడు వాళ్లను ఎలా గుర్తు పడతావని అడిగారు. ఐదెకరాల కంటే ఎక్కువ ఉన్నోడికి రైతు బంధు ఇవ్వనని అంటున్నాడని వాళ్లు ఏం పాపం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా అప్పర్ మానేరు నుండి అన్నారం బ్యారేజ్ వరకు వరద కాలువను రిజర్వాయర్ చేసి, కాకతీయ కాలువను 10 నెలలు నీళ్లు ఉండేలా పారించామని అన్నారు. గోదావరి మీద రిజర్వాయర్లు కట్టి కరీంనగర్ను సస్యశ్యామలం చేశానని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరంకు ఎదో అయిందని కరీంనగర్ను ఎండబెట్టారు.. ఊర్లల్లోకి మళ్లీ బోరు బండ్లు వస్తున్నాయని విమర్శించారు. బీజేపీ పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. మాట్లాడితే పాకిస్తాన్ను చూపిస్తున్నారు. అదో చిన్న దేశం ఒక్క జాపట్ కొడితే 25 ఏళ్లు మన తెరువురారని వాణ్ణి చూపించి డ్రామాలు చేసి పదిసంవత్సరాలు ఫూల్స్ ను చేశారని మోడీ పై మండిపడ్డారు. మోడీ కన్న ముందున్న 14 మంది ప్రధాన మంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే..మోడీ ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసాడని మండిపడ్డారు. అయినా ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని అన్నారు.