Farmers suicide: అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు....!
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. నిన్నమొన్నటి వరకు ఎండిన పంటలను చూసి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
న్యూస్ లైన్, హైదరాబాద్: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. నిన్నమొన్నటి వరకు ఎండిన పంటలను చూసి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు సరైన దిగుబడి లేక, పండిన పంటకు గిట్టుబాటు ధర రాక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత 5నెలల కాలంలోనే దాదాపు 230మందికి పైగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో మరో ఇద్దరు అన్నదాతలు అప్పులబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
సిద్ధిపేట జిల్లా బంగ్లా వెంకటాపూర్కు చెందిన అన్నమైన శివరాములు (40) ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇటీవల తనతో పాటు తన సోదరికి చెందిన వ్యవసాయ పొలంలో పచ్చిమిర్చి, కూరగాయలు సాగు చేశాడు. అయితే అనుకున్నంతగా పంట దిగుబడి రాక నష్టపోయాడు. ఓ వైపు వ్యవసాయ అప్పులు, మరోవైపు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో అప్పులు తీర్చలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బావి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి అక్కడే ఉరి పెట్టుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో మరో రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి మురళీధర్ రావు (48) పంట దిగుబడిరాక అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంత పొలంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పెట్టుబడులు పెరగడంతో పంట దిగుబడిరాక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ నెల 1న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు.