నిజాం రజాకార్ల అరాచకాల గురించి మనం విన్నాము కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాటిని స్వయంగా చూస్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి అన్నారు
న్యూస్ లైన్ డెస్క్: నిజాం రజాకార్ల అరాచకాల గురించి మనం విన్నాము కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాటిని స్వయంగా చూస్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్వీ నాయకులు మద్దతుగా నిరసన తెలుపుతున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం ఆయన తీవ్రంగా ఖండించారు. యూనివర్సిటీ లోకి వందల మంది పోలీసులు చొరబడి, ఒక్కో విద్యార్థి పైన రెండు డజన్ల మంది పోలీసులు మీద పడి కక్షకట్టినట్లు చితకబాదడం ఏందని నిలదీశారు. వాళ్ళేమైనా తీవ్రవాదులా? లేక ఉగ్రవాదులా? లేక వాళ్ళేమైనా రాజద్రోహం చేశారా అని ప్రశ్నించారు. అసలు యూనివర్సిటీ లోకి పోలీసులకు చొరబడే అధికారం ఎవరు ఇచ్చారని, ఇది చట్ట విరుద్ధం కాదా? పోలీస్ ల నీడలో విద్యార్థులు చదువుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు ఇవ్వమని అడిగినందుకు చితకబాదుతారా అదే విద్యార్థులు తిరగబడితే మీరు, మీ పోలీస్లు తట్టుకోలేరని హెచ్చరించారు. పవర్ ను చూసుకొని కాంగ్రెస్ పవర్ ఫుల్ అనుకుంటున్నారు. కానీ ఆ పవర్ ఇచ్చింది ఆ యువతనే అని మార్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. పవర్ ఫుల్ గా చేసిన వాళ్ళే నిన్ను పవర్ లెస్ గా కూడా చేయగలరు అది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమోదిస్తారా ఈ మార్పు గురించేనా మీరు ప్రజలకు చెప్పింది అని విమర్శించారు. ఈ మార్పు గురించే మీరు అధికారంలోకి వచ్చి ఉంటే మిమ్మల్ని మార్చే రోజు కూడా త్వరలోనే వస్తదన్నారు. నిజాంకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకు పట్టక తప్పదన్నారు. ఇది తెలంగాణ సమాజం, ఎంత తొక్కితే ఆంతే తీవ్రంగా స్పందిస్తుందని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.