Handloom Day: సంక్షోభంలో చేనేత రంగం.. కేటీఆర్ ట్వీట్

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.


Published Aug 07, 2024 02:57:22 PM
postImages/2024-08-07/1723022842_hand2.PNG

న్యూస్ లైన్ డెస్క్: నరాలను పోగులుగా చేసి.. తమ రక్తాన్ని రంగులుగా వేసి.. గుండెలను కండెలుగా మార్చి.. చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. పేగులను వస్త్రాలుగా అందించి.. మనిషికి నాగరికతను అద్దిన.. చేనేత కార్మికులందరికీ.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం.. దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగం అని తెలిపారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు.. మగ్గానికి మంచిరోజులు తెచ్చిన దార్శనికుడు.. వినూత్న పథకాలకు శ్రీకారంచుట్టిన పాలకుడు బీఆర్‌ఎస్ అధినేత  కేసీఆర్ అని పేర్కొన్నారు. సమైక్యరాష్ట్రంలో ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లే మాత్రమే అని, కానీ బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి రూ.1200 కోట్లు చేనేత కార్మికులకు కేటాయించిందని గుర్తు చేశారు. కేసిఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం.. ఎన్నో విప్లవాత్మక పథకాలకు చిరునామా తెలంగాణ రాష్ట్రం అన్నారు.

దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో “చేనేత మిత్ర”, నేతన్నకు చేయూత పేరుతో త్రిఫ్ట్ ప్రత్యేక పొదుపు పథకం, “నేతన్నకు బీమా” పేరుతో 5 లక్షల రూపాయల ధీమా, 36 వేల మంది నేతన్నల కుటుంబాలకు కొండంత అండగా బీఆర్‌ఎస్ పార్టీ నిలిచిందన్నారు. 10,150 మంది చేనేత కార్మికులకు.. రూ.లక్ష వరకు రూ.29 కోట్ల రుణాల మాఫీ జరిగిందని తెలిపారు. చేనేత కళాకారులకు ఆసరా పెన్షన్‌తో ఆపన్న హస్తం.. పద్మశాలీల ఆత్మగౌరవం పెంచే చారిత్రక నిర్ణయాలనేకం ఉన్నాయి అన్నారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించిన యజ్ఞం అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేశామని తెలిపారు. సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు ఓ సంకల్పం అని, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఓ సంచలనం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులు ఉన్నాయి అన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఛిద్రమవుతున్న బతుకులు ఉన్నాయి అని తెలిపారు. 

ఎన్డీయే హయాంలో తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్టీ పన్ను, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు రద్దు, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు, చేనేత కార్మికుల త్రిప్ట్ పథకం రద్దు, హౌస్ కం వర్క్ షెడ్ పథకాల రద్దు, మహాత్మాగాంధీ బునకర్ బీమా పథకం రద్దు, యార్న్ పై సబ్సిడీ 40% నుంచి 15 శాతానికి తగ్గింపు చేశారని విమర్శించారు. రేవంత్ పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రతినిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణమృదంగం అవుతుందన్నారు. ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు కళ్లు తెరవాలని, సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana brs congress ktr bjp cm-revanth-reddy

Related Articles