న్యూస్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో మరో పోరాటానికి నాంది పలకనున్నారని సమాచారం. రాష్ట్రంలో రుణమాఫీ, రైతుభరోసా, ఇతర రైతు, ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ త్వరలో పోరాటానికి సిద్ధమవుతున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రేపు సాయంత్రం బీఆర్ఎస్ కార్యాచరణపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్. వరుస సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట.
సెప్టెంబర్ మొదటి వారం నుంచి గులాబీ పార్టీ మరోసారి వరుస ఉద్యమాలు చేపట్టనుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాల మీద కేసీఆర్ సమర శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ కీలక నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత విడుదల పార్టీలో జోష్ పెరిగింది. ఆమె సైతం వారం రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొననున్నారు. దీంతో రాష్ట్రంలో సెప్టెంబర్ ఉద్యమం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.