Srinivas Goud: ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తాం

ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా అని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


Published Aug 08, 2024 08:22:41 AM
postImages/2024-08-08/1723122790_goudsaab.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా అని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామని ఆయన తెలిపారు. కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని, ఇలాంటి కథనాలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు అన్నారు. 2 ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైందని, అలాగని ఆ పార్టీ అక్కడితో ఆగిపోయిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు మా పార్టీ కూడా అంతే, కొందరు డబ్బుకు ఆశపడి వెళ్లారు. అంతమాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదని, ప్రజలు కూడా రైతు బంధు సహా అనేక పథకాలు ఎక్కువ ఇస్తామని చెబితే నమ్మి ఓట్లు వేశారన్నారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, కొన్నేళ్ళ తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారని తెలిపారు. 

బీఆర్ఎస్ బలహీనపడలేదని, పార్టీ బలంగానే ఉందన్నారు. ప్రజలు 39 సీట్లు ఇవ్వడం అంటే బలహీనమైనట్టు కాదని, నిన్నగాక మొన్న మహబూబ్‌నగర్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ గెలిచమన్నారు. ఒక జాతీయ పార్టీ ఎదగాలని కోరుకోవడం తప్పేం కాదు కదా అని ప్రశ్నించారు. కానీ ప్రజలు ఆ జాతీయ పార్టీ పక్క రాష్ట్రంలో ఏం చేసిందో చూస్తారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిగా మోడీయా.. రాహుల్ గాంధీయా అన్నదే చూశారు. అందుకే ప్రాంతీయ పార్టీలకు అవకాశం దక్కలేదని అన్నారు. బీఆర్‌ఎస్ అటో ఇటో ఉంటే మాగ్కూడా 10-15 సీట్లు వచ్చి ఉండేవి అని, మేం ఈ రెండు కూటముల్లో లేకపోవడం వల్లనే ఫలితాలు ఇలా వచ్చాయి అన్నారు. ఎన్నికలప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఉండదని, ఏ కూటమిలో చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇక విలీనం అన్న ప్రస్తావన అస్సలే లేదని, అది పూర్తిగా దుష్ప్రచారం అని కొట్టిపరేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీపై కుట్రలు జరిగాయిని, పార్టీ పని అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొందరి పాత బుద్ధి మారలేదని, ఇప్పుడు బీజేపీలో విలీనం అంటూ అత్యుత్సాహంతో కథనాలు రాస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమే అని, భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని, ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుందని, ప్రజలపక్షాన కొట్లాడతుందని తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్ర పరిస్థితి, ఏర్పడ్డ తర్వాత పరిస్థితిని పోల్చి చూడాలని అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, ఆర్థిక స్థితిగతులు, తెలంగాణ అస్తిత్వం ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. తెలంగాణ పేరు ఉచ్ఛరించడానికి కూడా భయపడేవారు అన్నారు. సచివాలయంలో భాష యాస మార్చుకుని మాట్లాడిన సందర్భాలున్నాయి అని, తెలంగాణ పేరు చెబితే గతంలో ఢిల్లీ ఏపీ భవన్లో గదులు కూడా ఇవ్వకపోయేవారు ఉన్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana brs congress bjp cm-revanth-reddy srinivas

Related Articles