తక్షణమే డీజీపీ ఈ వ్యవహారం పై స్పందించి హుస్సేన్ ఆచూకీ పై ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు
న్యూస్ లైన్ డెస్క్: పదిహేనేండ్లుగా జన జీవన స్రవంతిలో ఉంటున్న సింగరేణి ఉద్యమ నాయకుడు, రచయిత మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మానవ హక్కులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తక్షణమే డీజీపీ ఈ వ్యవహారం పై స్పందించి హుస్సేన్ ఆచూకీ పై ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజా పాలన అని చెప్పుకుంటూ అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు అని అన్నారు. హుస్సేన్ ప్రాణాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలని హెచ్చరించారు.
జమ్మికుంటలోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో ఉన్న మహమ్మద్ హుస్సేన్ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి, అరెస్టు నోటీసు లేకుండా బందువులకు ఏ విషయమూ తెలియజేయకుండా కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. మఫ్టీలో వచ్చిన వాళ్ళు పోలీసులమని చెప్పటం తప్ప, తాము ఎక్కడ నుండి వచ్చాము, ఎందుకు తీసుకెళ్తున్నాము వంటి సమాచారం కూడా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం లేదన్నారు.