Poonam: బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది

Published 2024-07-02 20:36:52
postImages/2024-07-02/1719932812_rtcpoonam.jfif

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న ఎన్నికల్లో చెప్పిన విధంగా మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, 100 శాతం అక్యూపెన్సి దాటిందన్నారు. కొత్త బస్సుల కొనుగోలుపై ప్రజా ప్రతినిధుల నుండి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆర్టీసినీ మరింత ప్రజల ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్, మెకానిక్ ఇలా 3035 ఉద్యోగాల భర్తీకి సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. 2014 తర్వాత మొదటిసారి ఆర్టీసీలో రిక్యూట్మెంట్ ఇప్పుడే జరుగుతుందని, ఇప్పటికే కారుణ్య నియామకాల కింద ఆర్టీసీలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు 1000కి పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇప్పటికే భారీగా కొత్త బస్సులు కొనుగోలు చేశామని, నూతనంగా మరో 2 వేలకు పైగా బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 33 జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధానికి ఏసీ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నామని, ప్రతి మండల కేంద్రం నుండి కూడా రాజధానికి బస్సులు నడపాలన్నారు. 

అన్ని గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ చేయాలని భావిస్తున్నామని, ప్రజల సహకారం వల్లే ఇవన్ని సాద్యమవుతాయి అన్నారు. ఉద్యోగుల శ్రమ ప్రభుత్వ సహకారంతో సంస్థ ముందుకు పోతుందని, మహిళల రాయితీ ప్రభుత్వం చెల్లించడం వల్ల ఆర్టీసి నష్టాల నుండి బయట పడుతుందన్నారు. గతంలో తీసుకున్న బకాయిలు, పిఎఫ్, కోఅపరెటివ్ సెస్, బ్యాంకు అప్పులు తీర్చడానికి పనిచేస్తున్నామన్నారు. 2013లో ఉన్న పెండింగ్  ఏరియంట్స్ 280 కోట్లు పెండింగ్ బకాయిలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 80 కోట్లు పూర్తి చేశామని, మరో 200 కోట్లు ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆలస్యమైనా ప్రతి కార్మికుడికి చెల్లిస్తామని హమీ ఇచ్చారు. 21 శాతం పీఆర్సీ అమలు చేశామని, ఆర్టీసి తార్నాక హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ గా మరుస్తున్నామన్నారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సతోపాటు అధునాతన చికిత్స అందిస్తున్నామని, దేశంలోనే ఆర్టీసి అగ్రగామిగా చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉద్యోగ నియామకాలు కూడా జాబ్ క్యాలెండరు ద్వారా పారదర్శకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆర్టీసి 3030 ఉద్యోగాల భర్తీ జరుగుతుందిని స్పష్టం చేశారు.