Drugs addict: ఒకప్పుడు జేఈఈ ర్యాంకర్.. ఇప్పుడు డ్రగ్స్ బానిస 2024-06-30 16:13:33

న్యూస్ లైన్ డెస్క్: చెడు స్నేహాల కారణంగా యువతరం మత్తుకు బానిసైపోతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి మార్గాలను వదిలేసి డ్రగ్స్(drugs) వంటి వాటికి అలవాటు పడడంతో ఎందరో ప్రతిభావంతుల జీవితాలు అంధకారంగా మారిపోతున్నాయి. ఏళ్ల తరబడి డ్రగ్స్ తీసుకోవడంతో అది ఒక వ్యసనంగా మారిపోతోంది. ఇలాంటి అలవాట్ల కారణంగా ఎంతో మంది మంచి భవిష్యత్తును కోల్పోతున్నారు. తీరా సమయం మించిపోయిన తరువాత ఆ అలవాటును మానుకొని సాధారణ జీవితం గడపాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతున్న పరిస్థితులు చాలానే ఉన్నాయి. తాజగా ఇలాంటి ఘటనే శేరిలింగంపల్లి(Serilingampalle)లో వెలుగులోకి వచ్చింది. 

ఇటీవల ఓ యువకుడు డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసు(police)లకు పట్టుబడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దీనిపై ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ యువకుడు మాట్లాడుతూ.. ఆల్ ఇండియా జేఈఈ(JEE)లో 800 ర్యాంక్ సాధించానని ఆ యువకుడు తెలిపాడు. ఒత్తిడి తగ్గించుకోవడానికి డ్రగ్స్ ఉపయోగపడతాయని స్నేహితులు తనకు గంజాయి అలవాటు చేశారని అతని తెలిపాడు.

2018 నుండి డ్రగ్స్ తీసుకుంటున్నానని, ఇప్పుడు ఇదొక వ్యసనంగా మారిందని తెలిపాడు. ఒకప్పటి జేఈఈ ర్యాంకర్ అయినప్పటికీ ఇప్పుడు డ్రగ్స్‌కు బానిసగా మారడంతో కెరీర్ గాడితప్పిందని వెల్లడించాడు. డ్రగ్స్ కారణంగా చదవడం కూడా మానేసానని అన్నాడు. చెడు స్నేహాలు చేయడం వల్లే డ్రగ్స్ వాడడం మొదలు పెట్టినట్లు తెలిపాడు. ఇక నుండి డ్రగ్స్‌కు  దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని, యువత కూడా ఇలాంటి చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని సూచించాడు.