AP: వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై మరోసారి విచారణ 2024-06-26 18:09:08

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ(AP)లో టీడీపీ అధికారంలోకి రాగానే పలుచోట్ల వైసీపీ కార్యాలయాల(YCP Office)ను తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలను అన్నింటినీ కూల్చేసే పనిలో అధికారులు ఉన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ కార్యాలయాల కూల్చివేత తీవ్రమైన దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే భవనాల కూల్చివేతను ఆపాలంటూ వైసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి(Lella Appireddy) బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 10 జిల్లాల కార్యాలయాలకు సంబంధించిన కూల్చివేతలు, నోటీసుల గురించి అందులో ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. అక్రమంగా కార్యాలయాలను అధికార పార్టీ కూల్చేస్తుందని వైసీపీ తరఫు లాయర్ వాదించారు. కాగా, ప్రభుత్వం నుండి వివరణ తీసుకున్న తర్వాత న్యాయస్థానానికి నివేదిక ఇస్తామని టీడీపీ తరఫు లాయర్ చెప్పారు. ఇరు వైపుల ఉన్న లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ అంశంపై కోర్టు గురువారం మరోసారి విచారణ జరపనుంది.