ప్రకాశం , బాపట్ల , పల్నాడు, తూర్పుగోదావరి జిల్లా , అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు భారీగా పడే అవకాశాలున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం చాలా వరకు మారిపోయింది, రుతుపవనాల ప్రభావంతో తేలిక పాటి వర్షాలు మొదలయ్యాయి. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు . ముఖ్యంగా ప్రకాశం , బాపట్ల , పల్నాడు, తూర్పుగోదావరి జిల్లా , అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు భారీగా పడే అవకాశాలున్నట్లు తెలిపారు.
అయితే కోస్తాంధ్ర తీరానికి అనుకుని సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ గాలుల వేగం గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. సముద్రం పోటు మీద ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని సముద్రతీరాలకు వెళ్లకుండా ఉండాలని మూడు రోజుల పాటు మత్స్యకారులను కూడా వేటకు వెళ్లకుండా ఆపుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు, గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.