Pawan: డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అయిన సినీ నిర్మాతలు  2024-06-24 07:14:32

న్యూస్ లైన్ సినిమా: సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌‌ను
ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాతలతో విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందులు, సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలను పవన్ కల్యాణ్‌కి వివరించారు. ఈ భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.  గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  సానుకూలంగా స్పందించినట్టు ఆయన తెలియచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదన్నారు. త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు. ఈ భేటీలో నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, శ్రీ సి అశ్వినీదత్, శ్రీ ఏ.ఎం. రత్నం, శ్రీ ఎస్.రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు, శ్రీ బోగవల్లి ప్రసాద్, శ్రీ డి.వి.వి.దానయ్య , శ్రీమతి సుప్రియ, శ్రీ ఎన్.వి.ప్రసాద్, శ్రీ బన్నీ వాసు, శ్రీ నవీన్ ఎర్నేని, శ్రీ వై రవిశంకర్ , శ్రీ నాగవంశీ, శ్రీ టి.జి.విశ్వప్రసాద్, శ్రీ వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.