CM: రేపు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

Published 2024-07-05 16:18:35

postImages/2024-07-05/1720176515_babuvsgm.png

న్యూస్ లైన్ డెస్క్:   శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రగతి భవన్ లో ఏర్పాట్లు చేశారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావటం ఇదే మొదటిసారి. అయితే ప్రధానంగా షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చ జరగనుంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. దాంతో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇక ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. దాంతో ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. అయితే మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఈ సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.