Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు విషజ్వరాలకు బలవుతున్నారు 

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు విషజ్వరాలకు బలవుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.


Published Aug 21, 2024 02:35:28 PM
postImages/2024-08-21/1724231128_imfire.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు విషజ్వరాలకు బలవుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అన్నారు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించామని, నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణ కొనసాగించాలన్నారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, వానాకాలం ప్రారంభంలోనే కోరామని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం తమ సూచనలను పెడచెవిన పెట్టిందని, సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృంభించేవి కావు అని ఆయన అన్నారు. ఏటా వానాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం మొదటి నుంచి పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిందని తెలిపారు. 

ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వహించ లేదన్నారు. దోమల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టలేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. మరోవైపు పంచాయతీలకు నిధులు విడుదల చేయయపోవడంతో గ్రామాలు మురికికూపాలుగా మారుతున్నాయి. సొంత జేబుల నుంచి ఖర్చు చేస్తూ వచ్చిన పంచాయతీ కార్యదర్శులు ఇక తమ వల్ల కాదని సామూహికంగా సెలవులు పెడుతున్నారని, విధులకు దూరంగా ఉంటున్నారని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ సమీక్షలు లేక, నిధులు విడుదల చేయక, పారిశుద్ధ్య నిర్వహణ జరగకపోవడంతో దోమలు విజృంభించి విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి అన్నారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జ్వరాల బారిన పడుతున్నారని, ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. 

ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదన్నారు. మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లడానికే ప్రాధాన్యమిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్దత వంటి ముఖ్యమైన  అంశాలపై తక్షణం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వైరల్ ఫీవర్స్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana fire mla brs congress health-news cm-revanth-reddy harish-rao

Related Articles