నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా సభానాయకులు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు లను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.
న్యూస్ లైన్ డెస్క్: నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా సభానాయకులు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు లను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయం అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే తప్పా అని ప్రశ్నించారు. రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల మరణాలు, ఆటో కార్మికుల బలవన్మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీడయడమే మేము చేసిన తప్పా అని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తడమే మేము చేస్తున్న తప్పా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మందబలంతో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ దురహంకారాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న ఒక్కో తప్పును లెక్కబెడుతున్నరని హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.