KTR: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకి ‘బండి’ సున్నా..!

తెలుగింటి కోడలైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ కోసం కొంత మేరకైనా నిధులు కేటాయిస్తారని ఆశించామని కేటీఆర్ అన్నారు.


Published Jul 23, 2024 05:19:10 AM
postImages/2024-07-23/1721727979_modi20240716T102646.194.jpg

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చిందేమీ లేదని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమీ ఇవ్వకపోవడంపై రియాక్ట్ అయ్యారు. తెలుగింటి కోడలైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ కోసం కొంత మేరకైనా నిధులు కేటాయిస్తారని ఆశించామని కేటీఆర్ అన్నారు.మొత్తం రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని ఆయన అన్నారు. 

బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి ముంబై-నాగపూర్, బెంగళూరు-చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగామని అన్నారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అన్నాం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. 

తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని అన్నారు. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా ప్రశ్నించాలని అన్నారు. దీన్ని బట్టి ప్రాంతీయ శక్తులను బలపరచడం ఎంత ముఖ్యమైన విషయం అనేది అర్ధం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. ఈరోజు పార్లమెంట్ లో కూర్చున్న తెలంగాణ మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్లని అన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదని అన్నారు. 

రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని, ఏపీ ఇండస్ట్రీయల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఈరోజు జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడడం సరికాదని కేటీఆర్ అన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu tspolitics telanganam nirmalasitharaman unionbudget

Related Articles