KTR: నిరుద్యోగుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తాం 2024-06-27 17:03:39

న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవటం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం లేదని ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాటానికి తమకు అండగా ఉండాలని కేటీఆర్‌ను నిరుద్యోగ అభ్యర్థులు గురువారం కలిశారు. వారితో సమావేశమై ఆ తర్వాత కేటీఆర్  మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్‌మెంట్లు అన్ని పత్రికల్లో ఇచ్చారని, దాదాపు 10 పరీక్షలకు సంబంధించి డేట్లతో సహా నోటిఫికేషన్లు అంటూ తేదీలు ప్రకటించి మోసం చేశారని మండిపడ్డారు. కానీ వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదన్నారు. వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో గ్రూప్-2లో 2 వేల ఉద్యోగాలు పెంచుతామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే గ్రూప్-3 లో వేలాదిగా ఉద్యోగాలు పెంచుతామని, మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారన్నారు. గ్రూప్-1కు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి కేవలం 60 ఉద్యోగాలు యాడ్ చేశారని తెలిపారు.

ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదలదు, అన్ని చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటూ వారికోసం పోరాడుతుందని కేటీఆర్ తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో ఈ డిమాండ్ చేశారన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు అభ్యర్థులకు మేలు చేసే విధంగా గ్రూప్-1 మెయిన్స్ 1:100 పద్ధతిలో పిలవటం లేదని నిలదీశారు. టెట్, గ్రూప్-1 ప్రిలిమ్, డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్ -3 ఎగ్జామ్‌లు వెంట వెంటనే ఉన్నాయని, చాలా మంది విద్యార్థులు అన్ని ఎగ్జామ్స్ రాస్తారన్నారు. కనుక ఎగ్జామ్ ఎగ్జామ్‌కి సరిపడేంత సమయం ఇవ్వాలని కోరారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని ఏదైనా చెప్పారో వాటిని వెంటనే రిక్రూట్ చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అదే విధంగా జాబ్ క్యాలెండర్‌ను కూడా ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, లేదంటే బీఆర్ఎస్ నాయకులందరం నిరుద్యోగుల పక్షాన రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఏ నిరుద్యోగులైతే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో వారే ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి వస్తుందని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.