TWJF: జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి 2024-06-27 20:15:54

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య గురువారం డాక్టర్ బీ.ఆర్  అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేది క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేది జర్నలిస్టులే అన్నారు. ఒక రకంగా అటు ప్రభుత్వంతో ప్రజలతో ఉంటూ సర్వీసు చేస్తున్న వారి జాబితాలో జర్నలిస్టులు ప్రధానంగా ఉన్నారన్నారు. రాష్ట్ర కేంద్రంతో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకు తక్కువ జీతాలు ఉండటంతో ఆర్థిక సమస్యలతో జీవనం సాగిస్తున్నారని ఫెడరేషన్ నేతలు వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. అయితే తమ జర్నలిస్టుల పిల్లలకు ఈ గురుకులాల్లో ప్రత్యేక కోటా కింద అడ్మిషన్లు కల్పించాలని విజ్ఞప్తి వారు కోరారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్​, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇప్పించేలా ప్రభుత్వం నుంచి సర్క్యులర్​ జారీ చేయాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం తరపున తమవంతు సహకారం అందించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కోరారు. గురుకుల విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రత్యేక కోటా ద్వారా సీట్లు కేటాయించాలని కోరారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించారు.