తన పెరట్లో మిరియాల చెట్టు పైకి ఎక్కి రమేశన్ మిరియాలు తీస్తుండగా బావిలో పడిపోయారు. దాదాపు 40 అడుగుల లోతైన చేదబావిలో పడిపోయాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతు బావిలో పడిపోయిన భర్తను 56 ఏళ్ల భార్య చాలా తెలివిగా కాపాడుకుంది. కేరళలోని ఎర్నాకుళం జిల్లా పిరవమ్ పట్టణం లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పెరట్లో మిరియాల చెట్టు పైకి ఎక్కి రమేశన్ మిరియాలు తీస్తుండగా బావిలో పడిపోయారు. దాదాపు 40 అడుగుల లోతైన చేదబావిలో పడిపోయాడు.
భార్య పద్మ కన్నీళ్లు పెడుతూ కేకలు వేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఒక తాడు సాయంతో వెంటనే బావిలోకి దిగింది. అప్పటికే నీటిలో మునిగిపోయిన భర్తను సుమారు 20 నిమిషాల పాటు ఆమె అలాగే ఒడిసిపట్టుకొని పైకి వినిపించేలా గట్టిగా కేకలు వేసింది.
ఆమె కేకలు విన్న అటుగా వెళుతున్న వారు పరిగెత్తుకుంటూ వచ్చి బావిలోకి చూశారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సాయంతో అగ్నిమాపక, పోలీసు సిబ్బంది వలల సాయంతో దంపతులిద్దరినీ బయటకు తీశారు. అనంతరం రమేశన్ను ఆసుపత్రికి తరలించారు. ఇలా సాహసోపేతంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి భర్తను కాపాడుకున్న పద్మపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.