రాజధాని అమరావతి నిర్మాణాన్ని మనం చెయ్యాలి…మనమే చెయ్యాలని మోదీ నొక్కిమరీ చెప్పారు. అంటే ఏపీలో ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎట్టకేలకు ఏపీ రాజధానిగా అమరావతి పనులు మొదలయ్యాయి. కేంద్రం సహాయంతో రాష్ట్ర రాజధానిని సుందరంగా తయారుచేయడానికి సన్నధ్ధాలు చేస్తున్నారు.ఐదుకోట్ల ఆంధ్రులు కలలు కన్న రాజధాని కల సాకారం అవుతున్నట్లే . ఇంతకీ కేంద్రం, మోదీ అమరావతికి ఇచ్చిన వరాలు ఏంటో తెలుసుకుందాం.
రాజధాని అమరావతి నిర్మాణాన్ని మనం చెయ్యాలి…మనమే చెయ్యాలని మోదీ నొక్కిమరీ చెప్పారు. అంటే ఏపీలో ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పాడ్డాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తే బీజేపీ కూడా చేసినట్లే కాబట్టే కేంద్రం ఈ అమరావతి పనులను చాలా పర్సనల్ గా తీసుకొని మరీ చేస్తుంది. నిధులు ఇస్తుంది. నజరానాలు పలుకుతుంది. ఓట్ల కోసమో..పేరు కోసమో ఏదైనా కాని ఏపీ కి మంచి జరుగుతుంది.2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడంతో అమరావతి నిర్మాణానికి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరపైకి తేవడంతో జనాలకు రాజధాని ఏంటో తెలీక తలలు పట్టుకున్నారు.
సీన్ కట్ చేస్తే ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచింది.దీంతో మళ్లీ మూడు రాజధానులు పోయి అమరావతికే పరుగులు పెట్టారు. అయితే అమరావతి నిర్మాణ పనులను ఏకకాలంలో చేపట్టేలా దాదాపు 77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే 49 వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లను ఖరారు చేసేసింది ప్రభుత్వం. రైల్వే బోర్డు కూడా రాజధానికి అమరావతికి రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలుపుతూ 2వేల 47కోట్లను మంజూరు చేసింది. ఎర్రుపాలెం-నంబూర్ మధ్య 56.53 కి.మీ. మేర రైల్వే లైన్ రానుంది. అదేవిధంగా 189.4 కి.మీ. పొడవున అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ను 16,310 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది. ఈ ఖర్చు కేంద్రం ఇస్తున్నట్లు భరోసా కూడా ఇచ్చింది. వడ్డించే వాడు మనవాడు..ఇక బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి...మోదీ మన వైపు ఉంటే ..రాజధాని ఎంత ఏపీ మొత్తం తిరిగి కట్టించుకోవచ్చు. తాపీగా ఆడుతూ పాడుతూ రాజధానిని రెడీ చేసేస్తారు.