లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నా.. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతుందని ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు మొద్దు నిద్ర వీడలేదని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్పై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
రాష్ట్రంలోని రైతులకు సాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తోనే పంట పొలాల ముంపునకు గురవుతున్నాయి అనేది అవాస్తవమని బాల్క సుమన్ స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ను బద్నాం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని కోసమే కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గతంలో 1983, 1986, 1996, 2003, 2016 సంవత్సరాల్లో ప్రాణహిత గోదావరి నదుల్లో వరద వచ్చి పంట నష్టం జరిగిందన్నది వాస్తవం కాదా? అని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో సగానికి పైగా డ్యామ్లు ఎండిపోయి సాగునీరు లేక రైతాంగం ఇబ్బంది పడుతోందని ఆయన గుర్తుచేశారు. లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నా.. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతుందని ఆరోపించారు.