KTR: సీఎం అంటే కటింగ్ మాస్టరా? 2024-06-23 17:07:12

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కటింగ్ మాస్టర్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ వ్యవహారిస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అసలు సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. మొదలు రుణమాఫీకి రూ.39 వేల కోట్లు అని చెప్పి ఇప్పుడు రూ.31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారన్నారు. పాసుబుక్కులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించమని, రేషన్ కార్డు సాకు చూపి లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించమన్నారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి, శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మొన్న లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు. నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని తెలిపారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదని, ఓట్ల పండగ ముగిసినా ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదన్నారు. కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారు. కానీ అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అని కోతపెడుతున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై మాట తప్పినా, మడమ తిప్పినా, లక్షలాది రైతు కుటుంబాల తరపున పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.