గురవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో వీరంతా సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇజ్రాయెల్ కు చెందిన 27 ఏళ్ల యువతితో పాటు ఆమెతో ఉన్న హోమ్ స్టే యజమాని పై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. వారితో పాటు వచ్చిన మరో ముగ్గురు టూరిస్ట్ లను కాలువలోకి నెట్టేయగా , ఒకరు గల్లంతయ్యారు. ఈ ఇన్సిడెంట్ కర్ణాటక లోని కొప్పళ జిల్లా గంగావతిలో జరిగింది.
ఇజ్రాయెల్ యువతి, అమెరికాకు చెందిన డేనియల్, నాసిక్కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన డిబాస్ ఆనెగుందిలోని అంబికా నాయక్ హోంస్టేలో బసచేశారు. గురవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో వీరంతా సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో వారిని అడ్డుకోవడానికి పర్యటకులు ప్రయత్నించగా, దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. తరువాత పంకజ్, డిబాస్, డేనియల్ను పక్కనే ఉన్న కాలువలోకి నెట్టేశారు.
కాలువలో పడిన పంకజ్, డేనియల్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ డిబాస్ నీటి ఉద్ధృతికి గల్లంతయ్యారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఓ మహిళ హోమ్స్టేకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని గంగావతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం గల్లంతైన బిబాష్ మృతదేహం లభ్యమైంది. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.డాగ్ స్క్వాడ్ సహా ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ ఓ బైక్, హ్యాండ్ బ్యాగ్, కెమెరా, పవర్బ్యాంక్, పెన్, విరిగిన గిటార్, గ్లోవ్స్, సిగరెట్స్, రక్తంతో తడిచిన వస్త్రాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు.