RS Praveen: కాంగ్రెస్ దళితుల మీద వివక్ష కొనసాగిస్తోంది

తెలంగాణలో దళితుల మీద తీవ్ర వివక్ష కొనసాగుతుందనడానికి, పాలన పడకేసిందనడానికి నిలువెత్తు నిదర్శనం ఆసిఫాబాదు జిల్లా దహెగాం మండలంలోని పెసరకుంట గ్రామంలోని నీళ్లలో మునగడానికి సిద్ధంగా ఉన్న ఈ దళిత బస్తీ అని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.


Published Sep 09, 2024 04:40:19 PM
postImages/2024-09-09/1725880219_rspf.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో దళితుల మీద తీవ్ర వివక్ష కొనసాగుతుందనడానికి, పాలన పడకేసిందనడానికి నిలువెత్తు నిదర్శనం ఆసిఫాబాదు జిల్లా దహెగాం మండలంలోని పెసరకుంట గ్రామంలోని నీళ్లలో మునగడానికి సిద్ధంగా ఉన్న ఈ దళిత బస్తీ అని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వానాకాలంలో ప్రాణహిత - పెద్ద వాగుకు వరదలొచ్చినపుడల్లా ఈ కాలనీ ముంపుకు గురైతుందని చెప్పి నాటి కలెక్టరు రోహిత్ రాజ్ ప్రభుత్వానికి ఒక ఎకరం భూమి కేటాయించడానికి అనుమతి ఇవ్వాలని రెండు సం.ల క్రితం సీసీఎల్ ఏకు లెటర్ రాశారని గుర్తు చేశారు.

ఎలాంటి అనుమతి రాకపోవడంతో దళితులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎత్తయిన ప్రాంతంలో ఆ ఒక్క ఎకరంలోనే ఇండ్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాటిని అనుమతిలేదని దౌర్జన్యంగా కూలగొట్టారని మండిపడ్డారు. నటుడు నాగార్జున, తిరుపతి రెడ్డి లాంటి మరెందరో బడాబాబులు అనుమతి లేకుండా బంగళాలు ఎట్ల కట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. మన అధికారులకు వాళ్ల దగ్గరికి పోయే ధైర్యం లేదని ఈ పేదలు అయితే ఈజీగా దొరుకుతరని అనుకున్నారా అని నిలదీశారు.  

గత సంవత్సరం తను నాటి కలెక్టరు హేమంత్ దగ్గరికి పోయ రెప్రజెంట్ చేస్తే తను చేయగలిగింది చేసిన అంతా సీసీఎల్యే చేతిలోనే ఉంది అన్నారని తెలిపారు. సీసీఎల్యే తనకు బాగానే పరిచయం కాబట్టి వారికి అన్నీ రికార్డులు ‘నాలుగు సార్లు’ వాట్సాప్ ద్వారా పంపించి పేదలకు న్యాయం చేయమన్నానని కోరాను అన్నారు. కానీ ఇంతవరకు ఆ ఎకరం భూమి అలాట్ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేదలందరూ గాఢ నిద్రలో పెద్ద వాగులో కొట్టుకొని చచ్చిపోతే అప్పుడు ఒక ఎమ్మార్వో సస్పెన్షన్, సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తారా అని ప్రశ్నించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అందులో ఒకడికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం, అంత్యక్రియలకు పది వేల రూపాయలు, అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ఎస్ ఆర్ శంకరన్, పీయస్ కృష్షన్ లాంటి ఐఏఎస్ అధికారులు మళ్లీ మళ్లీ పుడితే కానీ దేశంలో ఈ పేదలకు గూడు దొరకదేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నిమిషాల పనికి రెండు సంవత్సరాలా? పేదోళ్లకు న్యాయం చేయలేనప్పుడు ఎవడికోసం రా బాబూ ఈ ఐఏఎస్, ఐపీఎస్లు అని ప్రశ్నించారు. ఎందుకు మనకు ఈ ప్రభుత్వ కియా కార్నివల్, టయోటా లగ్జరీ కార్లు, బంగళాలు, బిళ్ల బంట్రోతులు, రాజ ప్రసాదాల్లాంటి ఆఫీసు చాంబర్లు, లగ్జరీ యాంటీ రూంలు ఇస్తుందన్నారు. వెంటనే ఈ ఆర్డర్ ఇవ్వక పోతే మేమే అక్కడ మా ఇళ్లు కట్టుకుంటామని, ఎవడైనా అడ్డొస్తే ఊరుకోమని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana brs cm-revanth-reddy congress-government rspraveenkumar

Related Articles