KTR: పంపింగ్ స్టార్ట్ చేయకపోతే.. రైతులతో మేము స్టార్ట్ చేస్తాం

కాలంతో పాటు పోటీ పడి ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


Published Jul 26, 2024 04:02:26 AM
postImages/2024-07-26/1721983964_krttt.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాలంతో పాటు పోటీ పడి ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం కన్నెపల్లి పంప్ హౌస్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్న ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాం జరిగిందన్నారు. తెలంగాణలో కరవు అనే మాటే వినబడకుండా ఉండేందుకు అఖండమైన సంకల్ప బలంతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు. తెలంగాణను భౌగోళికంగా చూస్తే మనకు నీళ్లు కావాలంటే ఎత్తిపోతలే మార్గం అని అందుకే ప్రాణహిత, మానేరు, గోదావరి కలిసే ఈ ప్రాంతంలో నీళ్లు తీసుకోవచ్చవని కేసీఆర్ మేడిగడ్డ పాయింట్‌ను ఎంచుకున్నారు అని తెలిపారు. తెలంగాణకు ఇంచు ఇంచుకు నీళ్లు ఇచ్చే బహుళార్థ  ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్నారు. సముద్ర మట్టం నుంచి దాదాపు 618 మీటర్ల వరకు నీళ్లను ఎత్తిపోయగల కామధేనువు, కల్పతరువు కాళేశ్వరం అని, కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులం మొత్తం ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు.

బటన్ ఆన్ చేస్తే చాలు సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, భువనగరి, ఆలేరు వరకు మనం సస్యశ్యామలం చేయవచ్చు అని మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయకమ్మ సాగర్, అన్నపూర్ణ జలాశయానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే శరణ్యం అన్నారు. నీళ్లను ఎత్తిపోసి కాళేశ్వరంలోని రిజర్వాయర్లన్నింటినీ నింపితే హైదరాబాద్‌కు కూడా పుష్కలంగా నీళ్లు ఇవ్వవచ్చు అని, మేడిగడ్డ నుంచి అటు హైదరాబాద్ వరకు ఇటు ఆలేరు వరకు తాగు, సాగు నీళ్ల బాధ లేకుండా చేయవచ్చు అన్నారు. ఇప్పుడు నీళ్లను ఎత్తిపోయటమనేది ప్రధానాంశం అని, మేము ఇంజనీర్లను అడిగితే బ్రహ్మండంగా నీటిని ఎత్తిపోయవచ్చని అన్నారు. సుందిళ్ల, అన్నారం విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ తప్పించుకునే సాకులు వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. నిజానికి సుందిళ్ల, అన్నారంలో డ్రౌటింగ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో భాగమేనని ఇంజనీర్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కరీంనగర్‌లో మూడు రోజులకొకసారి నీళ్లు ఇస్తున్నారు. రైతులు కరవు పరిస్థితులున్నాయని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడు నిండు కుండలా ప్రాజెక్ట్‌లు కళకళలాడాయి. ఇప్పుడు నీళ్లకు కరవు ఏర్పడిందని చెబుతున్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌లో వంద కంపోనెంట్లలో ఒక్కటైన మేడిగడ్డ వద్ద చిన్న సమస్యను భూతద్దంలో చూపెట్టారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయి అని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు ఒక్క రోజులో రిపోర్ట్ పేరుతో డ్రామా చేశాయి అని, అటు కాంగ్రెస్ నాయకులు కూడా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా కేసీఆర్ పై కక్షగట్టి ఆయనను గద్దె దించారని, మీ లక్ష్యం నెరవేరింది కదా అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఇంకా కేసీఆర్ మీద పడి ఏడ్వటం ఎందుకు ఆయనను బద్నా చేసే కుట్రలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే రాజకీయాలు చేద్దామని, ఆ తర్వాత నాలుగున్నరేళ్లు ప్రజల కోసం పనిచేద్దామన్నారు. ప్రజలకు మీకు మంచి అవకాశం ఇచ్చారు. అధికారాన్ని ప్రజలకు మంచి చేసేందుకు వినియోగించండి అని కేటీఆర్ సూచించారు. గత డిసెంబర్-జనవరిలో కూడా రాజకీయాలు వద్దు రైతులకు నీళ్లు ఇవ్వండంటూ కోరామని, కానీ కేసీఆర్ మీద కోపంతో రైతులకు అన్యాయం చేసి పంటలను ఎండబెట్టారని విమర్శించారు. ఇవ్వాళ కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతి చూస్తుంటే మనసు ఉప్పొంగిందని, కానీ ఎల్ఎండీ, మిడ్ మానేరు, శ్రీరాం సాగర్ ఎండిపోతుంటే మనసుకు బాధ అవుతోందని అన్నారు. కావాల్సిన నీళ్లు ఉన్నాయి.. ఇప్పుడు కావాల్సింది ఒక్క రాజకీయ నిర్ణయం మాత్రమే అన్నారు. ఒక్క బటన్ నొక్కితే చాలు అటు సిరిసిల్ల నుంచి హైద్రాబాద్ వరకు, ఇటు కరీంనగర్ నుంచి తుంగతుర్తి వరకు నీళ్లు వెళ్తాయి. కేసీఆర్ బంగారు పల్లెంలో పంచభక్ష పరమాన్నాలు మాదిరిగా మీకు అన్న సిద్ధం చేసి పెట్టారన్నారు. వాటిని కూడా వాడుకోలేని దౌర్భగ్యపు పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాము రాజకీయ కక్షలు మాని.. రైతులకు మేలు చేయాలని కోరారు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు అంటే ఆగస్ట్ 2 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు. ఈలోపు అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతుల పంటలను ఎందుకు ఎండబెడుతున్నారో చెప్పాలంటూ చర్చను కూడా కోరతామని, ఆగస్ట్ 2 లోపు ప్రభుత్వం గానీ పంపింగ్ స్టార్ట్ చేయకపోతే.. 50 వేల మంది రైతులతో మేమే కన్నెపల్లి పంప్ హౌస్‌ను స్టార్ట్ చేస్తామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress ktr kaleshwaram-projcet

Related Articles