Harish Rao: తెలంగాణ బడ్జెట్‌లో ప్రజలకు మొండిచేయి 

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి ఆత్మస్తుతి, పరనిందగా ఉందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.


Published Jul 25, 2024 06:03:39 PM
postImages/2024-07-25/1721910819_asam.jfif

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి ఆత్మస్తుతి, పరనిందగా ఉందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బడ్జెట్ పైన మాట్లాడారు. ప్రజల ఆశలను వమ్ము చేశారని, హామీలకు కేటాయింపులు లేవు అన్నారు. బీఆర్‌ఎస్ అప్పులు చేశామని నిందించారు. భట్టి రూ. 57 వేల కోట్లు అప్పు తెస్తామన్నారని, మా ప్రభుత్వం తెచ్చినదానికంటే రూ. 17 వేల కోట్లు ఎక్కువ తెస్తామన్నారని తెలిపారు. భట్టి ఆరు గ్యారంటీలను తన బడ్జెట్లో పూర్తిగా మరిచిపోయారని, ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 గురించి ప్రస్తావించలేదన్నారు. రూ. 4 వేల ఫింఛన్ ఇస్తామని బాండు పేపర్ మీద రాశారు. మరి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. అత్యంత పేదలైన అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వింతంతువులు, దివ్యాంగుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు.. బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు, కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన లేదు, జాబ్ క్యాలండర్, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ప్రస్తావన కూడా లేదని విమర్శించారు. ఆటో కార్మికులకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో మొండిచేయి చూపారని, ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులకు గుండు సున్నా చూపారని మండిపడ్డారు.

గత ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అనడం అన్యాయం అని, కేసీఆర్ అభివృద్ధి పనులను తమ ఘనతగా చెప్పుకుంటున్నది కాంగ్రెస్ అన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో 13 స్థానంలో ఉన్న తెలంగాణను మేం నంబర్ 1 స్థానంలో తీసుకొచ్చామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,47,099 అయితే దేశ తలసరి ఆదాయం రూ. 1,83,236 అంటే రాష్ట్ర పౌరుడి తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయానికంటే 1 లక్ష 64 వేల 63 రూపాయలు ఎక్కువ అని పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఫలితం అన్నారు. బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 4,51,580 కోట్లు అని 2023-24 నాటికి అది రూ. 14,63,963 కోట్లు అన్నారు. అంటే మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. తెలంగాణ వృద్ధి రేటు 11.9 శాతం కాగా దేశ వృద్ధి రేటు 9.1 శాతమే అని, తెలంగాణ గ్రోత్ రేటు బావుందని నీతి ఆయోగ్ కూడా మెచ్చుకుందని గుర్తు చేశారు.వ్యవసాయానికి ఊతమిచ్చి కోటి 27 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడిని 4 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచామని, పంజాబ్‌ను తలదన్ని ఎదిగామంటే కేసీఆర్ పనితీరు కారణం కాదా? పండిన పంట నిజం కాదా? మీ బడ్జెట్లో ఏదో చెప్పినంత మాత్రాన నిజాలు నిజం కాకుండా పోతాయా అని ప్రశ్నించారు. 

బడ్జెట్లో గొల్ల కుర్మలకు మోసం చేశారని, గతేడాది 50 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పుడు సున్నా కేటాయించారని విమర్శించారు. పింఛన్లు పెంచడం లేదని అర్థమైందని, గతేడాది రూ. 7,335 కోట్లు పెడితే, ఇపుడు రూ. 7,376 కోట్లు మాత్రమే పెట్టారని తెలిపారు. ఈసారి కొత్త పింఛన్ ఇవ్వరని తేలిపోయిందన్నారు. ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రూ. 31 వేల కోట్లు ఇస్తామన్నారు.. కానీ బడ్జెట్లో రూ. 15,470 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులతో ఒకేసారి మాఫీ ఎలా సాధ్యం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుబంధు స్థానంలో రైతుభరోసా అన్నారు. దాని ఊసు కూడా లేదని హరీష్ రావు అన్నారు. మైనారిటీలకు రూ. 4 వేల కోట్లని మేనిఫెస్టోలో చెప్పి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. ఐదేళ్లలో ప్రతి సంవత్సరానికి బీసీలకు రూ. 20 వేల కోట్ల ఇస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లు మాత్రమే కేటాయించారు అని తెలిపారు. ఇరిగేషన్‌కు కూడా నిధులు తగ్గించారని, పోయినేడాది బీఆర్ఎస్ రూ. 26,825 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రూ. 22,300 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితబంధు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచుతామన్నారు.. ఆ ప్రస్తావన కూడా లేదని గిరిజన బంధులేదన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం 5 డీఏలు బాకీ పడ్డదని, బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదన్నారు. కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన కేటాయింపులు ఈ బడ్జెట్లో లేవు అని, గత బడ్జెట్లో తను చూపిన ఎక్సైజ్ ఆదాయం రూ. 18,470 కోట్లు అన్నారు. కానీ భట్టి ప్రతిపాదించింది రూ. 25,617 కోట్లు అని అంటే ఏడు వేల కోట్లు ఎక్కువ గల్లీకో వైన్ షాప్ పెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్సైజ్, వ్యాట్ కలుపుకుంటే రూ. 15 వేల కోట్ల ఎక్కువ ఆదాయం రాబడతామని చెప్పారు. అంటే తాగుబోతు తెలంగాణను తయారుచేస్తారా అని ప్రశ్నించారు. స్టాంపు డ్యూటీ ఆదాయం రూ. 14,295 కోట్లని గత బడ్జెట్లో తను ప్రతిపాదిస్తే భట్టి రూ. 18,228 కోట్లు అన్నారు. అంటే 4 వేల కోట్ల ఎక్కువ అని భూముల విలువ, రిజిస్ట్రేషన్, పన్నుల భారం పెంచుతామని చెప్పకనే చెప్పారు అని హరీష్ రావు పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs harish-rao budjet

Related Articles