Vinod kumar: బార్ కౌన్సిల్‌ను మోడీ మోసం చేశారు 2024-06-30 18:54:26

న్యూస్ లైన్ డెస్క్: బార్ కౌన్సిల్‌(Bar council)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) మోసం చేశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌(telangana bhavan)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాలపై ఆయన పలు కీలక అంశాలు తెలిపారు. 

జూలై 1 నుండి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకొని రానుందని ఆయన తెలిపారు. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండే ఈ చట్టాలు ఉన్నాయని తెలిపారు. మార్పు అంటే మంచి జరగడం.. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు(new laws) ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని వెల్లడించారు. 2023 ఆగస్టులోనే చట్టాల మార్పు బిల్లులను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిందని వినోద్ కుమార్ తెలిపారు. 

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొత్త చట్టాలపై విస్తృతంగా పరిశీలించి అనేక మంచి సూచనలు చేశారు. కానీ, ఆ సూచనలను కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యులను బయటకు పంపించి మరీ బిల్లును కేంద్రం పాస్ చేయించుకుందని ఆరోపించారు. చట్టాలను ఇంగ్లీష్‌లో ప్రవేశపెట్టాలని రాజ్యంగంలో రాసి ఉందని తెలిపారు.

కొత్త చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టారని వినోద్ కుమార్ తెలిపారు. ఆ పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకంగా ఉన్నాయని వెల్లడించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్లు ఆందోళన చేయవద్దని అన్ని బార్ అసోసియేషన్స్‌కు ముందుగానే లేఖలు రాశారని తెలిపారు. ఇప్పటికే మోడీ తెచ్చిన నల్ల చట్టాలతో  రైతులు చనిపోయారని వినోద్ కుమార్ అన్నారు. చట్టాల మార్పులను వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్‌ను రిజిస్టర్ చేయకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే విధంగా కొత్త చట్టం తెచ్చారు. దీని వల్ల బెయిల్‌ను స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. బాధితులు హంసకు గురవుతున్నారని తెలిపారు. 

దేశ న్యాయ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికి బేడీలు వేయవద్దని సుప్రీం కోర్టు చెప్పింది, కానీ కొత్త చట్టాల్లో చేతికి బేడీలు వేయాలని వుందని అన్నారు. కొత్త చట్టాలతో బాధితులకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి 14 రోజులకు బదులుగా 90 రోజుల వరకు అవకాశం ఇచ్చారు. బార్ కౌన్సిల్‌ను మోడీ మోసం చేశారని వినోద్ కుమార్ ఆరోపించారు. 

దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ లాయర్లు కూడా కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కేంద్ర హోంశాఖా మంత్రి, న్యాయ శాఖా మంత్రులకు లేఖ రాశానని వినోద్ కుమార్ వెల్లడించారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నామని అన్నారు. ఈ అంశంపై రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు స్పందించాలని డిమాండ్ చేశారు.