న్యూస్ లైన్ డెస్క్: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ గాంధీ విఫలమైయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పైన రాహుల్ వైఖరిని కేటీఆర్ ఖండించారు. బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కాంగ్రెస్లో చేరిన తర్వాత రాజీనామా చేశారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ అన్నారు. కానీ పార్టీ ఫిరాయించి లోక్సభకు కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటని, కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతేంటని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్ రాజ్యాంగాన్ని ఇలాగే నిలబెట్టబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయనీయకపోతే, కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 10 సవరణలకు మీరు కట్టుబడి ఉన్నారని దేశం ఎలా విశ్వసిస్తుందన్నారు. ఇదేనా రాజ్యాంగాన్ని కాపాడడం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఫిరాయింపుల పైన రాహుల్ గాంధీ మాటల్ని దేశం నమ్మదని కేటీఆర్ పేర్కొనారు.