Harish Rao: కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది

కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.


Published Sep 07, 2024 08:41:37 PM
postImages/2024-09-07/1725721897_reiiit.PNG

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఒకవైపు గురుకుల విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పూర్తి స్థాయి వీసీ నియామకం, నిధుల గోల్ మాల్, మెస్ కాంట్రాక్టులలో పారదర్శకత, సిబ్బంది నియామకాలు, ఆరోగ్య సేవల మెరుగుదల, ఫుడ్ కోర్టు టెండర్ సమీక్ష, ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల పెంపు వంటి 17 డిమాండ్లతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసనలు తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రచార యావ కోసం ట్రాక్టర్‌లో వెళ్లి కళాశాల గోడ దూకి నానాయాగి చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తమని భ్రమింపజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రివై నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నవు గానీ, విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ప్రశ్నార్థకం చేశారని అన్నారు. 

గతంలో తమ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వెళ్లి సమస్యలు పరిష్కరించారు. మేము చేసిన కృషిని కూడా కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశావు కాబట్టే ఈరోజు సమస్యలు పేరుకుపోయాయి అని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు గోడలు దూకి వెళ్లావు కదా, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తమని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి? కొత్త వాటి ఊసు లేదు, ఉన్నదానికి దిక్కులేదని ధ్వజమెత్తారు. 

ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నతమైన ట్రిపుల్ ఐటీ వరకు కాంగ్రెస్ 9 నెలల పాలనలో ధ్వంసం కాని విద్యావ్యవస్థ ఇంకేమైనా ఉందా అని ప్రశ్నించారు. మీ పాలనలో టీచర్లు లేక 1800 పాఠశాలలు మూతపడ్డాయి. కల్తీ ఆహరంతో ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోయాయి. 600 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలు కాగా, 40 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమస్యల నిలయంగా విద్యాలయాలు మారిపోయాయి అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించడంతో పాటు, విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs cm-revanth-reddy congress-government harish-rao

Related Articles