ఏకంగా వేలల్లో కోళ్లు అమ్మడం ఏంటని ఆశ్చర్యపడుతున్నారు. అది కూడా గతంలో ఎన్నడూ , ఎక్కడా లేని విధంగా శ్రావణమాసంలో మాంసం ధర పెరగడం ఏంటని అనుకునున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు వ్రతాలు, పూజలు అంటూ ఎక్కువ మంది మాంసానికి చాలా దూరంగా ఉంటారు. దీంతో చికెన్, మటన్ ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఈ క్రమంలోనే మొన్నటి దాకా ఆకాశాన్నంటిన చికెన్ ధరలు కాస్త తగ్గిపోయాయి. కిలో రూ.300 వరకు పలికిన చికెన్ ధర ఇప్పుడు రూ .180కి చేరింది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం రూ.150కే చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి.
అయితే, అన్ని చోట్లా చికెన్ ధరలు తగ్గుతుంటే.. ఒక చోట మాత్రం కోళ్లు వేళల్లో ధరలు పలుకుతున్నాయి. ఈ విషయం తెలిసిన వారంతా.. ఓవైపు కనీసం రూ .250 కూడా లేదంటే.. ఏకంగా వేలల్లో కోళ్లు అమ్మడం ఏంటని ఆశ్చర్యపడుతున్నారు. అది కూడా గతంలో ఎన్నడూ , ఎక్కడా లేని విధంగా శ్రావణమాసంలో మాంసం ధర పెరగడం ఏంటని అనుకునున్నారు.
అయితే, వేల రూపాయల్లో ధర పలుకుతున్న ఈ కోళ్లు దుకాణాల్లో దొరికేవి కాదు. వేలం పాటలో దొరికే కోళ్లు. కోడి పందేలు ఆడే వారి దగ్గర ఉండే కోళ్లు. వీటిని పట్టుకున్న పోలీసులు వేలం వేయడంతో వేలకు వేలు పోసి కొనుక్కున్నారు. పెద్దపల్లి జిల్లా కామన్పూర్ ఠాణాకు చెందిన పోలీసులు.. కోళ్లను పందాల్లో వీటిని పట్టుకున్నారు. వాటిని వేలం వేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు రెండు కోళ్లను వేలానికి పెట్టారు. ఇందులో ఒక కోడి పుంజు రూ .2500 పలకగా.. మరొకటి రూ.4000 పలికింది.