గాంధీ భవన్ ముందు గద్వాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని నిరసన వ్యక్తం చేశారు. సరిత తిరుపతయ్య నాయకత్వం వర్థిల్లాలని నినాదాలు చేశారు. వారి నాయకత్వంలోనే పనిచేస్తామని అన్నారు. కొద్దిరోజులుగా కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పార్టీ మారుతున్నట్టు కృష్ణ మోహన్ ప్రకటించారు. అయితే ఆయన చేరికను గద్వాల కాంగ్రెస్ నాయకులు సరిత తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణమోహన్ తమ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై కేసుల పెట్టించారని ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని వ్యతిరేకిస్తున్నారు.
అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వారితో చర్చలు జరిపారని, పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారని వార్తలు వచ్చాయి. కానీ గాంధీభవన్ వద్ద గద్వాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నిరసనతో వారి మధ్య ఇంకా సంది కుదిరినట్టు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోకి కృష్ణమోహన్ చేరిక ఎలాంటి పరిణామాల మధ్య జరగబోతుందని అన్నది ఆసక్తికరంగా మారింది.