కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రిని కలిసి అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్సీఐ) ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం గారు రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసిన కారణంగా వాటిని పునరుద్ధరించాలని లేదా కొత్తగా మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో లోక్ సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి ఉన్నారు. సోమవారం ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలను కలిసి కేబినెట్, నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ వంటి పలు అంశాలపై చర్చ జరిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని పునస్సమీక్షించాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది.