ఈ యాత్ర విజయవంతమైతే రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టిస్తారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత వ్యోమిగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి పయనం కానున్నారు. ఆగ్జియమ్-4 వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన అంతర్జాతీయ కేంద్రానికి వెళ్లనున్నారు. చాలా సార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈ నెల 19 న చేపట్టేందుకు సర్వం సిధ్ధమైంది. ఈ యాత్ర విజయవంతమైతే రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టిస్తారు.
ఆగ్జియమ్ స్పేస్ సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తోంది. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఈ గ్రూప్ కు శుభాంశు శుక్లా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నీవ్స్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగేరి) ఇతర సభ్యులుగా ఉన్నారు.
వాస్తవానికి ఈ మిషన్ మే 29 న ప్రారంభం కావాల్సి ఉండగా ....ఫాల్కన్ -9 రాకెట్ లో ద్రవ ఆక్సిజన్ లీక్ సమస్య రావడంతో చాలా సార్లు వాయిదా పడింది. ఫస్ట్ ఈ నెల 8 కి ఆపై 10 మళ్లీ 11 తేదీలకు మార్చినప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. దీనికి తోడు అంతర్జాతీయ కేంద్రంలో రష్యన్ జ్వెజ్డా మాడ్యూల్ లో పీడన సమస్య కూడా తలెత్తడంతో నాసా ఆగ్జియమ్ స్పేస్ సంస్థలు వ్యోమగాముల భద్రత దృష్ట్యా ప్రయోగాన్ని మరింత ఆలస్యం చేశాయి.దీంతో జూన్ 19న ప్రయోగానికి మార్గం సుగమమైందని పేర్కొంది. శుభాంశు శుక్లా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో ఇస్రో చురుగ్గా పాలుపంచుకుంటోంది.