మరో లగచర్ల చేయకండి!
డంపింగ్ యార్డు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి
గుమ్మడిదలలో బంగారంలాంటి పంటలు
ఇక్కడి భూములు గుంజుకునేందుకు కుట్రలు
అసెంబ్లీ వేదికగా భూములు గుంజుకునే ప్రయత్నం
ప్రజలు, రైతుల నిరసనకు మాజీ మంత్రి మద్దతు
గుమ్మడిదలలో హరీశ్ రావు సంచలన విమర్శలు
తెలంగాణం, సంగారెడ్డి(ఫిబ్రవరి 14): గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన రైతులు, స్థానికులకు మద్దతు తెలిపిన ఆయన.. డంపింగ్ యార్డు తెచ్చి తమ నెత్తిన వేయకండి అంటే మొండిగా సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పర్యావరణం దెబ్బతింటుందని, నర్సాపుర్ చెరువు కలుషితం అవుతుందని, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయనే తాము వ్యతిరేస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు గతంలోనే ఈ పనులను తమ ప్రభుత్వం నిలిపివేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వెళ్తున్నదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నడని, వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నాడని, రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదని హెచ్చరించారు. గుమ్మడిదల రైతులు అందరికీ ఆదర్శమన్నారు. బంగారం వంటి పంటలు పండిస్తారన్నారు. తక్షణమే డంప్ యార్డు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక లగచర్ల భూములు గుంజుకున్నాడని, న్యాల్కల్లో పచ్చటి పొలాలు గుంజుకునే ప్రయత్నం చేశాడన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అన్నడు, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నాడన్నారు. ఊళ్లలో మంది ఎంత మంది ఉంటే అంత మంది పోలీసులను పెట్టారని విమర్శించారు. ఓట్లేసిన పాపానికి ప్రజలను మోసం చేశారని, రుణమాఫీ, రైతుభరోసా, మహాలక్ష్మి, ఇలా అన్నీ మోసమేనని, గుమ్మడిదల రైతుల కోరిక మేరకు డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారన్నారు. తప్పకుండా అసెంబ్లీ వేదికగా ప్రజల తరపున పోరాటం చేస్తామని, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు. ఎయిర్ ఫోర్స్ వాళ్లు సైతం ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అయినా పట్టించుకోవడం లేదన్నారు. టిప్పర్లు, పోలీసులను వెనక్కి తీసుకోవాలని, ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోవాలని, కళ్లు తెరవకుంటే తగిన శాస్తి తప్పదన్నారు. చేతిలో అధికారం ఉందని బలవంతంగా పని చేయొద్దని సూచించారు. రెండుసార్లు హైకోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని, హైకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆపాలని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను హెచ్చరించారు.