KTR: కాంగ్రెస్ అక్రమ చేరికల అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయమైన, అక్రమమైన చేరికల అంశాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721120489_assktr.jfif

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయమైన, అక్రమమైన చేరికల అంశాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పార్టీ ఫిరాయింపుల అంశంలో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉందని, ఈ విషయాన్ని స్పీకర్‌కి గుర్తు చేశామన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మరో ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్‌కు ఫిర్యాదు చేయటం జరిగింది. ఇప్పటికే దానం నాగేందర్ పైన ఇచ్చిన ఫిర్యాదు పైన వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మణిపూర్‌‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారిన సంఘటనలో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పరిధిలోనే ఉన్నారని తెలిపారు. కాబట్టి ఇక్కడ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. లేదంటే పదవికి అగౌరవంగా ఉంటుందన్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌‌లో ఉన్న విషయాన్ని కూడా స్పీకర్‌కి చదివి వినిపించామని, మూడు నెలల్లోగా స్పీకర్‌కి అందిన ఫిర్యాదుల పైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందన్నారు. మణిపూర్ ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌‌ను కోరటం జరిగిందని తెలిపారు.


ఢిల్లీలో రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఫోజులు కొడుతారు. కానీ మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పార్టీ ఫిరాయింపుపై గగ్గోలు పెట్టే రాహుల్ గాంధీ తెలంగాణలో  మాత్రం ఎమ్మెల్యేల ఫిరాయింపులను వెన్నుతట్టి మరి ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అని అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య రూ. 50 కోట్లకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో పరిశీలించాలని స్పీకర్ గారిని కోరటం జరిగింది. గోవాలో కాంగ్రెస్ అభ్యర్థులను పార్టీ మారమని రాహుల్ గాంధీ శపథం చేయించిన అంశాన్ని కూడా స్పీకర్‌కి గుర్తు చేశారు. హర్యానా, హిమాచల్‌లో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తే వారు సానుకూల నిర్ణయం తీసుకున్నారని స్పీకర్‌కు వివరించామన్నారు. స్పీకర్‌ని అధికారులు, ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తున్నారు అనే విషయాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ అంశంలో నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ పదవికి ఎలాంటి కళంకం రాదనే తీరుగా ప్రభుత్వాధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పార్టీపై గెలిచిన అభ్యర్థులు ఇంకో పార్టీలోకి వెళ్లొద్దు అనే విషయాన్ని స్పష్టం చేశారు. 

స్పీకర్ గొప్ప ఆలోచన విధానాన్ని అభినందిస్తున్నట్లు తెలిపామన్నారు. ఇంటర్వ్యూలలో మాత్రమే కాకుండా మేము ఇచ్చిన ఫిర్యాదుపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. స్పీకర్ పైన మాకు విశ్వాసం ఉందని, వెంటనే ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టు వెళ్తామన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి అని తెలిపారు. పార్టీ మారని మా ఇద్దరూ ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉండే ఇద్దరు డీఎస్పీలు ఫోన్ చేసి మీకు ప్రాణ భయం ఉందనే విషయాన్ని పరోక్షంగా హెచ్చరించారు. బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిని తెలంగాణలో చేస్తోందని, మా పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఆస్తులు, భవనాలపైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కొంతమందికి ప్రాణగండం ఉందంటూ పార్టీ మారేలా ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని, మరి కొంతమంది ఎమ్మెల్యేల వ్యాపారాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ద్వారా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగానే ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎన్ని చేసినా సరే ప్రజాక్షేత్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ప్రజలు శిక్షిస్తారని కేటీఆర్ అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana brs congress ktr speaker assembly

Related Articles