నికోలస్ తన కెరీర్ లో వన్డే ఫార్మాట్ 61 మ్యాచ్ లు ఆడి 39.66 సగటు, 99.15 స్ట్రైక్ రేట్తో 1,983 పరుగులు సాధించాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : క్రికెట్ వరల్డ్ ను ఆశ్చర్యపరుస్తూ వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. జస్ట్ 29 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ ట్రినిడాడ్ ఆటగాడు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో వెస్టిండీస్కు 167 మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించిన ఆయన కెరీర్కు తెరపడింది.
నికోలస్ తన కెరీర్ లో వన్డే ఫార్మాట్ 61 మ్యాచ్ లు ఆడి 39.66 సగటు, 99.15 స్ట్రైక్ రేట్తో 1,983 పరుగులు సాధించాడు. ఇక టీ20 ఇంటర్నేషనల్స్లో వెస్టిండీస్ తరఫున అత్యధికంగా 2,275 పరుగులు చేసిన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. ఈ ఫార్మాట్ లో ఆయన స్టైక్ రేట్ 136.39 గా ఉంది. పొట్టి ఫార్మాట్ లో కరేబియన్ జట్టు తరుపున 106 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు.
చాలా ఆలోచన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను . నేను ప్రేమించిన ఆట నాకు చాలా ఇచ్చింది. ఇస్తూనే ఉంటుంది. ఆనందం , లక్ష్యం మరపురాని జ్ఞాపకాలు, వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం" అని పూరన్ తన సోషల్ మీడియా పేజీలో పేర్కొన్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్ మన్ 2016 లో పాకిస్థాన్ పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అంతకు రెండేళ్ల ముందు 2014 అండర్ -19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లో వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహించాడు.
2018 లో వన్డే అరంగేట్రం చేసిన పూరన్ 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఏదేమైనా, "వెస్టిండీస్ క్రికెట్పై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. భవిష్యత్తులో జట్టుకు, ఈ ప్రాంతానికి విజయం, బలం చేకూరాలని కోరుకుంటున్నాను" అని పూరన్ తన వీడ్కోలు ప్రకటనలో పేర్కొన్నాడు.