Telangana: గురుకుల టీచర్ అభ్యర్థులకు హరీష్ రావు మద్దతు

సీఎం స్పందించి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరికొంత మంది మహిళా అభ్యర్థులు మోకాళ్లపై కూర్చొని కొంగుచాచి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకున్నారు. 


Published Jun 26, 2024 04:49:27 AM
postImages/2024-06-26/1719392412_Untitleddesign17.jpg

న్యూస్ లైన్ డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee hills)లోని సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) నివాసం వద్ద గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి ఇంటి ఆవరణలో గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. సీఎం స్పందించి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరికొంత మంది మహిళా అభ్యర్థులు మోకాళ్లపై కూర్చొని కొంగుచాచి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకున్నారు. 

ఇక దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రైతులు, విద్యావంతులు అనే తేడా లేకుండా అందరినీ అడుక్కునే స్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గురుకుల టీచర్ అభ్యర్థుల అంశం దుమారంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు(Harish rao) దీనిపై స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్న గురుకుల టీచర్ అభ్యర్థులకు హరీష్ రావు తన మద్దతు తెలిపారు. 

రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని హరీష్ రావు 'X' వేదికగా ట్వీట్ చేశారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ల మీద నిలబడి ఎన్నిసార్లు వేడుకున్నా అభ్యర్థుల మొర వినిపించుకోకపోవడం శోచనీయమని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి గతంలో అధికారంలో ఉన్న BRS పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. 

టీచర్ల కొరత లేకుండా చేసి, విద్యాప్రమాణాలు మరింత పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9210 టీచర్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఉండాలని, ఒక్క పోస్ట్ కూడా మిగిలిపోవద్దనే లక్ష్యంతో ఉన్నత హోదా పోస్టుల నుండి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయించిందని హరీష్ రావు వెల్లడించారు. 

అయితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు దీనివల్ల దాదాపు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయి, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పోస్టులు బ్యాక్ లాగ్ అవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu brs tspolitics congress telanganam cm-revanth-reddy jubilee-hills harish-rao residential-teacher-aspirants

Related Articles