BJP Mla: మోడల్‌ స్కూల్‌ విషయంలో సీఎం రేవంత్ మోసం చేశారు 2024-06-28 07:07:50

న్యూస్ లైన్ డెస్క్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ అనుమతి కోరుతూ ఢిల్లీలో కేంద్ర మంత్రి,  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని శుక్రవారం రాకేష్ రెడ్డి కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి రావల్సిన ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌ను  ఖమ్మం జిల్లా, మధిరకు కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇటీవల ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మొదటిది తన నియోజకవర్గం కొడంగల్‌కు కేటాయించుకున్నాడని, రెండోది మధిరకు కేటాయించారన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూల్‌ భవనాల నిర్మాణాల కోసం. రూ. 150 కోట్ల నిధులు ఆర్మూర్‌కు దక్కాల్సిందని, ఈ నిధులు వేరే చోటికి సీఎం రేవంత్ పంపించారని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. ఇప్పుడు మూడో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఆర్మూర్ నియోజకవర్గానికి కేటాయించాలని, లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటనలో పేర్కొన్నారు.