ఖమ్మం వరద బాధితులు సాయం అడిగితే లాఠీ ఛార్జ్ చేయడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం వరద బాధితులు సాయం అడిగితే లాఠీ ఛార్జ్ చేయడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన అంటే ఇదేనా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు తగిన న్యాయం చేసే చేతకాక దాడులు చేస్తుందని ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వరదలో రాణి, వారి 3 పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. చివరికి మధిర నుంచి వారి బంధువులు గజ ఈతగాళ్ళని తెచ్చి ప్రాణాలు వారే కాపాడుకున్నారని తెలిపారు.
ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే, ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి 9 ప్రాణాలు కాపాడారని తెలిపారు. ధైర్యం చెప్పి రక్షించాల్సిన మంత్రులు, చివరికి దేవుడే దిక్కు అని చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రజాసమస్యలు ఎత్తిచూపిన స్పందించడంలేదని, వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీచార్జీలతో వారిని హింసిస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటీకైన ముఖ్యమంత్రి రేవంత్ సిగ్గు తెచ్చుకోవాలని కేటీఆర్ సూచించారు.