Cm Revanth: పెద్దన్న అనుకుంటే.. పెద్ద సున్నా ఇచ్చాడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పెద్దన్నలా భావిస్తే తెలంగాణకు సున్నా ఇచ్చాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


Published Jul 23, 2024 08:29:36 AM
postImages/2024-07-23/1721738144_modigm.PNG

న్యూస్ లైన్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పెద్దన్నలా భావిస్తే తెలంగాణకు మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ 2047 బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించింది. స్వయంగా తనే మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరడం జరిగిందని, వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి సహకరించాలని కోరామని తెలిపారు.

రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం కానీ మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని, తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడటంలేదన్నారు. వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదని రేవంత్ తెలిపారు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయించిందని, మరి పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు అని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డుకు ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదన్నారు.

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారని, వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారు అని సీఎం రేవంత్ అన్నారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదని, ఇది కుర్చీ బచావో బడ్జెట్ అన్నారు. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీకి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు మాత్రమే కావాలని, కానీ అభివృద్ధి పట్టదా అని కేంద్రాన్ని నిలదీశారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి, బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వం అని కేంద్రం చెప్పినా కిషన్ రెడ్డి ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలని ప్రశ్నించారు. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.


తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుందని, విభజన చట్టం కేవలం ఏపీకి మాత్రమే కాదు తెలంగాణకూ వర్తిస్తుందన్నారు. బడ్జెట్ ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే అన్నారు. కిషన్ రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, మంత్రి పదవి  కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ వద్ద తాకట్టు పెట్టొద్దని తెలిపారు. పోలవరంకు నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో నిరసనకు బీజేపీ ఎంపీలూ కలిసి రావాలని, తెలంగాణపై మోడీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని, ఇది ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

newsline-whatsapp-channel
Tags : telangana cm-revanth-reddy pm-modi centralbudget

Related Articles