Cm Revanth: పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై సీఎం రేవంత్ స‌మీక్ష‌

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష‌ నిర్వహించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపున‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సీఎం రేవంత్ ఆదేశించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721052629_pancm.PNG

న్యూస్ లైన్ డెస్క్: పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష‌ నిర్వహించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపున‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సీఎం రేవంత్ ఆదేశించారు. పంచాయ‌తీల ఎన్నిక‌ల‌కు సంబంధించి బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ల అమ‌లు, రాబోయే ఎన్నిక‌ల్లో వాటి పెంపున‌కు సంబంధించిన అంశాల‌ను వెల్ల‌డించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల అనుస‌రించిన విధానం, రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న తీరును అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఇప్ప‌టికే కుల గ‌ణ‌నకు ఆమోదం తెలిపినందున‌, దాని ఆధారంగా పంచాయ‌తీ ఎన్నికల‌కు వెళితే ఎలా ఉంటుంద‌ని, అందుకు ఎంత స‌మ‌యం తీసుకుంటార‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ప్ర‌శ్నించారు. 

క‌ర్ణాట‌క‌లో 2015 లో, బిహార్‌లో 2023లో కుల గ‌ణ‌న చేశార‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కుల గ‌ణ‌న చేసిన వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని అధికారులు వివ‌రించారు. 2011లో కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రించిన కుల గ‌ణ‌న ఫార్మాట్ 53 కాల‌మ్స్‌తో ఉంద‌ని, దానికి మ‌రో మూడు కాల‌మ్స్ జోడించి కుల గ‌ణ‌న చేప‌డితే క‌నీసం అయిదున్న‌ర‌ నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు వివ‌రించారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుతో పాటు స్థానిక సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే నిధులు ఆగిపోకుండా త్వ‌ర‌గా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. స‌మావేశంలో రిజ‌ర్వేష‌న్ల పెంపు అంశంపై సుదీర్ఘ చ‌ర్చ సాగింది. ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, సీత‌క్క‌ బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ వ‌కుళాభ‌రణం కృష్ణ‌మోహ‌న్‌  రిజ‌ర్వేష‌న్ల పెంపు సాధ్యాసాధ్యాల‌పై త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.  

ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి తెలంగాణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల వ‌ర‌కు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీంకోర్టులో దాఖ‌లైన కేసులు, వాటి తీర్పులు, ప‌ర్య‌వ‌సానాల‌ను మాజీ మంత్రి జానారెడ్డి వివ‌రించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి స్పందిస్తూ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజర్వేష‌న్ల అమ‌లుకు ఇప్ప‌టి వ‌ర‌కు అనుస‌రించిన విధానాల‌పై కాల క్ర‌మ ప‌ట్టిక రూపొందించాల‌ని సూచించారు. ఏవైనా సందేహాలు వ‌స్తే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయ‌తీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్న‌తాధికారుల స‌ల‌హాలు తీసుకోవాల‌ని, చ‌ట్ట‌ప‌ర‌మైన విష‌యాల్లో అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తో చ‌ర్చించాల‌ని సూచించారు. మిగ‌తా రాష్ట్రాలు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో అనుస‌రిస్తున్న విష‌యాల‌పై అధ్య‌య‌నం చేయాలని ఆదేశించారు. త్వ‌ర‌గా ఆయా అంశాల‌పై నివేదిక రూపొందిస్తే శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు ముందే మారోసారి స‌మావేశ‌మై ఈ అంశంపై తుది నిర్ణ‌యం తీసుకుందామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ జి.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,  పంచాయ‌తీరాజ్ శాఖ కార్య‌ద‌ర్శి డి.ఎస్‌.లోకేష్ కుమార్‌,  న్యాయ శాఖ కార్య‌ద‌ర్శి రెండ్ల తిరుప‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy meet

Related Articles