CS: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.


Published Jul 26, 2024 08:49:56 AM
postImages/2024-07-26/1722001778_csmeet.PNG

న్యూస్ లైన్ డెస్క్: గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సీఎస్ ఆదేశించారు. డీజీపీ జితేందర్‌, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌ రావు, పోలీసు, విద్యుత్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎస్ పలు సూచనలు చేశారు. ముందుగా ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ లోని సైనిక అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి తరువాత గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారని ఆమె తెలిపారు. వేడుకల సందర్భంగా అసెంబ్లీ, కౌన్సిల్‌, హైకోర్టు, రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబందిత అధికారులను సీఎస్ ఆదేశించారు.

జాతీయ పతాకం ఎగురవేసే ప్రధాన డయాస్ వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి శాఖను సిఎస్ కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ను అతిథులు అందరూ చూసేందుకు వీలుగా ప్రధాన డయాస్ ఏర్పాట్లు ఉండాలన్నారు. వేడుకలు నిర్వహించే పరిసర ప్రాంతాలలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి  పారిశుద్ధ్య పనులలో ఎలాంటి లోపాలు ఉండరాదని పురపాలక శాఖను ఆదేశించారు. అంబులెన్స్‌, నర్సింగ్‌ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ప్రముఖులకు, అధికారులకు, వేడుకకు హాజరయ్యేవారికి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఫైర్ శాఖను,  అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వెయ్యి మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నామని  కల్చరల్ డిపార్ట్‌మెంట్ అధికారులు సీఎస్ కు తెలిపారు. సాంప్రదాయ వస్త్రధారణతో కళాకారుల ప్రదర్శనలు వేదికకు వన్నె తెచ్చేలా ఉంటాయని అధికారులు వివరించారు. వచ్చేనెల 13న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరగనుండగా 10వ తేదీ నుంచి రిహార్సల్స్ ఉంటాయని అధికారులు వివరించారు.

newsline-whatsapp-channel
Tags : telangana meet official-announcement cs-shanti-kumari

Related Articles