క్రిమినల్ కేసులు ఉన్నోళ్లు
ప్రజాప్రతినిధులుగా అర్హులా?
సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
కేసుల వేగవంతంపై కేంద్రం, ఈసీలకు నోటీసులు
ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
రాష్ట్రాలు తమ ఆదేశాలను
పాటించకపోవడంపై అసహనం!
కోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా నివేదిక
తెలంగాణం, ఢిల్లీ(ఫిబ్రవరి 10): క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే ఉద్యోగంలో చేరేందుకు అనర్హులని, అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు అవుతారని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై దాఖలైన పిటిషన్పై సోమవారం విచారణ జరిపగా.. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తన నివేదికను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవని నివేదికలో పేర్కొన్నారు. నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం, పదేపదే వాయిదాలు కోరుతుండటం జాప్యానికి మరో కారణమని తెలిపారు. నివేదికను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.