ఏమయ్యా యాదయ్య..
దాడులు చేపిస్తున్నవట..!
చిలుకూరి పూజారిని పరామర్శిస్తందుకు వెళ్లిన..
ఎమ్మెల్యే కాలె యాదయ్యతో సీఎం సెటైర్లు
సీరియస్ ఇష్యూపై ఇదేం స్పందన
సోషల్ మీడియాలో సీఎంపై నెటిజన్ల ఫైర్
ఇంత జరిగితే..
ఒక్క మాట చెప్పలేదు..!
చిలుకూరి పూజారీతో ఫోన్లో సీఎం రేవంత్
మా పోలీసులు ఉంటారు, చూసుకుంటారు..
మా ఎమ్మెల్యేకు కూడా చెప్తా..
ఏదున్నా కమిషనర్ చూసుకుంటడు
రంగరాజన్ ను పరామర్శించే సందర్భంగా..
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
తెలంగాణం, హైదారబాద్(ఫిబ్రవరి 10): చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం ఫోన్లో పరామర్శించి క్షేమసమాచారం తెలుసుకున్నారు. రంగరాజన్తో ఫోన్లో మాట్లాడుతూ.. అయ్యో.. ఇంత జరిగితే ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటని ప్రశ్నించారు. తాను పోలీసులకు ఆదేశాలిచ్చానని, స్థానిక ఎమ్మెల్యేకు కూడా చెప్పానన్నారు. ఏ సమస్య ఉన్నా కమిషనర్ చూసుకుంటారని, ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. ఈ సందర్భంగా చిలుకూరి బాలాజీ దర్శనం చేసుకుంటానని అన్నారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఏమయ్యా.. పూజరుల మీద దాడులు చేయిస్తున్నావంట అంటూ నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే, సోమవారం రాత్రి దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ చిలుకూరు వెళ్లారు. రంగరాజన్ను పరామర్శించారు. దాడి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు.