రేవంత్ సవాల్‌కు నేను సిద్ధం..!


Published Feb 22, 2025 11:13:52 AM
postImages/2025-02-22/1740203032_WhatsAppImage20250222at10.29.07AM.jpeg

రేవంత్ సవాల్‌కు నేను సిద్ధం
ఏ రోజు.. ఎక్కడో చెప్పాలి
చెప్పిన చోటికి, సమయానికి వస్తా
పనికి మాలిన 14 నెలల పాలనపై చర్చిద్దాం
పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా
నిందలు మాని.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడు
పోతిరెడ్డిపాడుకు పొక్కబెడుతుంటే బయటకు వచ్చినం
నాడు 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం
పాలమూరు ఉసురుపోసుకుంటున్న ఊసరవెల్లి
సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు


తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 21): సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, చేతగాని రేవంత్ రెడ్డికి కోతలెక్కువ అని విమర్శించారు. పనికి మాలిన పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు తాను సిద్ధమని, రేవంత్ రెడ్డి సవాలను స్వీకరిస్తున్నానని హరీశ్ రావు ప్రకటించారు. ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చర్చ చేద్దామో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి తాను వస్తానని అన్నారు. అది కొడంగల్ నియోజకవర్గమైనా సరే, చివరకు రేవంత్ రెడ్డి ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తానన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు, రుణమాఫీ, రైతుబంధు, మహాలక్ష్మి పథకం, పెంచవలసిన పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, పెన్షనర్లకు ఇవ్వని పెన్షన్ బెనిఫిట్ ల సంగతి సకలం చర్చిస్తానన్నారు. పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతానని హరీశ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కుసంస్కారి కనుకే కేసీఆర్‌పై కక్షపూరిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. దవడలు పగల గొట్టాల్సివస్తే అన్నింటా దగా చేసి.. ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్న రేవంత్ రెడ్డి దవడనే పగలగొట్టాలన్నారు. అరుపులు, పెడబొబ్బలతో రాష్ట్ర సాగు, తాగు నీళ్ల కష్టాలు తీర్చలేవు రేవంత్ రెడ్డి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిందలు వేయడం మాని నదీజలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని హితవు పలికారు. కడుపులో విషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో పాలన చేస్తే ఫలితాలు రావని, అబద్ధాల కోసం అజ్ఞానిలా బుర్రను వాడే బదులు పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించు రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు సూచించారు. 

రేవంత్ రెడ్డివి పిచ్చి ప్రేలాపనలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై నారాయణపేట జిల్లా పర్యటనలో పచ్చి అబద్ధాలు ఆడిండని మండిపడ్డారు. పిచ్చి ప్రేలాపనలు పేలిండన్నారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, చేతగానితనాన్ని గుర్తు చేసిన తమ మీద రంకెలేస్తున్నాడని విమర్శించారు. పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్‌లతో అనునిత్యం అంటకాగి పాలమూరుకు తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పాలు తాగి రొమ్ము గుద్దిన చరిత్ర ముఖ్యమంత్రిదని, అది చరిత్ర చెపుతున్న సత్యమన్నారు. పాలమూరును దత్తత తీసుకున్నా అని చెబుతూనే పడావు పెట్టిండు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అన్నారు. ఆ చంద్రబాబుకు పాద సేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలను కాలరాచిన పాపమే పాలమూరుకు శాపమైందన్నారు. ఆనాడు తెలంగాణలో ఓట్లడిగే మొఖం చెల్లక తమ పొత్తు కోసం జోలె పట్టింది రేవంత్ రెడ్డి అని, ఇప్పటికీ నెత్తికెత్తుకునే ఆయన ప్రియమైన తెలుగుదేశం పార్టీ అని హరీశ్ విమర్శించారు. 

నాడు 40 రోజులు అసెంబ్లీ స్తంభింపజేసినం

పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతామన్నందుకే కదా రేవంత్ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి తాము బయటకు వచ్చిందని గుర్తు చేశారు. నదీ జలాల్లో కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగానే ఆనాడు 40 రోజులు పాటు అసెంబ్లీనీ స్తంభింపచేసినమన్నారు. రేవంత్ రెడ్డి వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా? ఆయన వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా? అని విమర్శించారు. పోతిరెడ్డిపాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చింది, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసింది కాంగ్రెస్ నేతలనే చరిత్ర మరచి రేవంత్ మాట్లాడటం గురివింద సామెతను గుర్తు చేస్తోందన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేసినా.. మోడీకి భయపడి బడే భాయ్ అన్నా అది రేవంత్ లాంటి ఊసరవెల్లికే సాధ్యమన్నారు. రేవంత్‌కు నీటి విలువ, నోటి విలువ తెలియదన్నారు. తెలిసింది ఒక్క అవినీతి నోట్ల విలువ మాత్రమే నన్నారు. రేవంత్ నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడొద్దని, నువ్విప్పుడు బాధ్యత గల ముఖ్యమంత్రివనే విషయం మరచిపోవద్దన్నారు.

పాలమూరు ఉసురుపోసుకుంటున్న ఊసరవెల్లి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ కేసులు వేయించిన ఘాతకుడివి రేవంత్ రెడ్డి అన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని 90% పనులు పూర్తి చేసినమన్నారు. మిగిలిన 10% పనులు చేయకుండా కావాలని పండపెట్టి పాలమూరు ప్రజల ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లి రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే కొడంగల్ నారాయణపేటకు కూడా నీళ్లు వస్తాయని, కేవలం స్వార్థం కోసం, కమిషన్ల కోసం నారాయణపేట ఎత్తిపోతల పథకాన్నీ తెరమీదకు తెచ్చారాని ఆరోపించారు. దరిద్రపు కాంగ్రెస్ రాకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్లు కడిగేవాళ్లమన్నారు. కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలస బోయిన వాళ్లను వాపస్ తెచ్చింది కేసీఆర్, మీ పాలనలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్ అన్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27 వేల ఎకరాలే సాగైతే, ప్రాజెక్టుల పనులు పూర్తిచేసి దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్ అన్నారు. జూరాలకు సంబంధించి కర్ణాటకలో ఉన్న సబ్మర్జెన్స్ కాంపెన్సేషన్ చెల్లించి పూర్తిస్థాయిలో నీటిని నింపి లక్ష ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరు అందించింది కేసీఆర్ అన్నారు. ఆర్డీఎస్ కింద కాంగ్రెస్ దరిద్ర బోర్డు పాలనలో 30 వేల నుంచి 35,000 ఎకరాలకు మించి ఎన్నడూ సాగయ్యేది కాదన్నారు. తాము తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి చేసి రాజోలి బండ పూర్తి ఆయకట్టుకు నీళ్ళు అందించామన్నారు. 

ఒక్క చెక్ డ్యామ్ కట్టని చేతగాని సీఎం

మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసి మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరులో నీళ్లు అందించిన ఘనత తమదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికాగానే మరో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బీఆర్ఎస్ చేసిన కృషితోనే రాష్ట్రంలో అత్యధికంగా సాగునీటి వసతి కలిగిన సస్యశ్యామల జిల్లాగా పాలమూరు మారుతుందన్నారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని అర్బకుడివి నువ్వు కేసీఆర్ మీద రంకెలేస్తావా సూర్యుడి మీద ఉమ్మేసినట్టేనని హరీశ్ రావు విమర్శించారు. ఉత్త వాగుడే తప్ప ఒక్క వాగు మీద కూడా ఒక్క ఇటుక పెట్టని ఒక్క చెక్ డ్యాం కూడా వదరుబోతువు నువ్వన్నారు. 14 నెలల్లో ఒక్క చెక్ డాం కూడా కట్టని చేతగాని ముఖ్యమంత్రివి కేసీఆర్ గురించి మాట్లాడుతావా అని మండిపడ్డారు.

newsline-whatsapp-channel
Tags : congress cm-revanth-reddy harish-rao

Related Articles