రేవంత్.. నయా నీరో : KTR


Published Feb 26, 2025 12:51:57 AM
postImages/2025-02-26/1740552527_revanthreddyktr.jpg

రేవంత్..
నయా నీరో..! 
రైతులు చనిపోతున్నా పట్టించుకుంటలేడు
SLBC టన్నెల్‌లో 8 మంది చిక్కుకుంటే..
మొన్నటి దాకా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసిండు
కనీసం పట్టించుకోకుండా నిన్న ఢిల్లీకి పోయిండు
రేవంత్‌కు నిద్రలో కూడా కేసీఆర్ యాదికొస్తున్నారు
కేసీఆర్, బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు పప్పులు ఉడకవ్
తెలంగాణ కోసం కొట్టాడేది కేసీఆర్, గులాబీ సైన్యమే
దమ్ముంటే కడియం రాజీనామా చేయాలి
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు 
కేటీఆర్ సమక్షంలో చేరిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు


 గుక్కెడు మంచినీళ్ల కోసం కిలోమీటర్లు నడిచే దురవస్థ నుంచి తెలంగాణ ఆడబిడ్డలను కాపాడుకున్నామని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను కట్టామని పేర్కొన్నారు. రైతుబంధు రూపంలో రూ. 73,000 కోట్లను 70 లక్షల రైతుల ఖాతాలో టైమ్‌కు వేశామని, 28 వేల కోట్ల రూపాయలతో రెండుసార్లు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ కట్టామని, వరంగల్లో తెలంగాణలోని అతిపెద్ద హాస్పిటల్‌ని కట్టామని కేటీఆర్ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని విజయాలను చెప్పుకొచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు రేవంత్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్‌పై పెరుగుతున్న నమ్మకానికి సంకేతమన్నారు. 

తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 25): ఒకప్పటి రోమ్ చక్రవర్తి నీరోను రేవంత్ రెడ్డి తలపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో మంగళవారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం 48 గంటల్లోనే రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక రైతు చొప్పున ఇప్పటివరకు 450 మంది రైతులు చనిపోతే రేవంత్ రెడ్డిలో కనీసం చలనం కూడా రావడం లేదన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఉన్నా పట్టించుకోకుండా 36వ సారి రేవంత్ ఢిల్లీకి పోయాడన్నారు. 

దమ్ముంటే కడియం రాజీనామా చేయాలి!

15 నెలల స్వల్ప కాలంలోనే అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే ఆ పార్టీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతం ఇదన్నారు. ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమే కాదని, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్‌లో చేరుతున్నారన్నారు. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్నారు. అక్కడ బిఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేయనందుకు బాధపడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచినా ఓడినా ఫరక్లేదని రేవంత్ చిద్విలాసంగా మాట్లాడుతున్నాడన్నారు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడన్నారు. హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి అని, తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపి వేస్తాడా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ యాదికొస్తున్నారన్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తాను ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి కలలో కూడా ఊహించుకోలేదన్నారు. 

రేవంత్‌ను కాపాడుతున్న కాంగ్రెస్

శివుడు గంగమ్మ తల్లిని దివి నుంచి గుడికి తీసుకొస్తే కేసీఆర్ గోదావరి నదిని 80 మీటర్ల నుంచి 618 మీటర్లపైకి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్‌ను నింపారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని కేటీఆర్ నిర్మించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజ్లలో 340 పిల్లర్లు ఉన్నాయి. అందులోని ఒక పిల్లర్ పర్రే బాస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు నానా యాగి చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు దున్నపోతు ఈనింది అంటే బీజేపీ వాళ్లు దుడ్డే కట్టేయమన్నట్టు కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి తెలంగాణ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయినా, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోతే, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకపోతే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడడం లేదని, ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా ప్రధాని మోడీ పనిచేస్తున్నాడన్నారు. కాళేశ్వరం పిల్లర్ పర్రె బాయడంపై హడావుడి చేసిన ఎన్డీఎస్ఏ ప్రమాదాల విషయంలో మౌనంగా ఎందుకు ఉందన్నారు. సుంకిశాల ప్రమాదంపై వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద అప్లై చేస్తే దేశ భద్రతకు సంబంధించిందని రేవంత్ ప్రభుత్వం చెప్తుందన్నారు. తెలంగాణలో రాహుల్ రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ ఆరోపించినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు బీజేపీ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఉన్నన్ని రోజులు తమ పప్పులు ఉడకవని కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. లగచర్లలో తన అల్లుడి ఫ్యాక్టరీకి భూములు ఇవ్వనందుకే అక్కడి రైతులపై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిండన్నారు. లగచర్ల లంబాడ సోదరుల కోసం ఢిల్లీ వరకు వెళ్లి కొట్లాడి వాళ్లకు బెయిల్ ఇప్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామంటూ కొడంగల్ నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైందన్నారు. 

తెలంగాణ కోసం కొట్లాడేది కేసీఆరే

రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ విలువ అర్థమవుతుందన్నారు. రైతుల ఖాతాల్లో టకీ టకీమని పైసలు పడతలేవు కానీ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీకి మాత్రం టకీ టకీమని రేవంత్ రెడ్డి పైసలు పంపుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తాము చేసిన అప్పు సంవత్సరానికి 41 వేల కోట్లు అని, ఆ అప్పులతో సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని సంస్కరించామన్నారు. పది నెలల్లో లక్షన్నర కోట్ల రూపాయలు అప్పుతో ఒక్క ప్రాజెక్ట్ అయినా రేవంత్ రెడ్డి ప్రారంభించిండా అని ప్రశ్నించారు. కొత్తగా ఒక్క ఇటుకైనా పేర్చిండా గోడైన కట్టిండా అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రామ్ రామ్ అయితదని కేసీఆర్ ముందే చెప్పిండన్నారు. ఈ లక్షన్నర కోట్ల అప్పుతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారన్నారు. రాజయ్య నేతృత్వంలో స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. సంస్థాగతంగా పార్టీని అద్భుతంగా నిర్మించుకుందామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడేది కేసీఆర్, గులాబీ సైన్యమే అన్నారు. పార్టీ రజతోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.

newsline-whatsapp-channel
Tags : kcr revanth-reddy ktr farmer

Related Articles