ఓ వ్యక్తి సంవత్సరాల క్రితంపూడ్చి పెట్టిన శవాన్ని సమాధి నుంచి బయటకు తీసి దానితో సెల్ఫీలు దిగాడు. దీంతో ఇక ఊరి వాళ్ల కోపం చూడాలి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వీరబ్రహ్మం గారు కూడా ఇంత విచిత్రమైన వింత మనుషులు పుడతారని ఊహించిఉండరు. వైరల్ అవ్వడం కోసం ఏమైనా చేస్తున్నారు. వీరిది పిచ్చో..వెర్రో భగవంతునికే తెలియాలి. పశ్చిమబెంగాల్ లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఓ వ్యక్తి సంవత్సరాల క్రితంపూడ్చి పెట్టిన శవాన్ని సమాధి నుంచి బయటకు తీసి దానితో సెల్ఫీలు దిగాడు. దీంతో ఇక ఊరి వాళ్ల కోపం చూడాలి.
పిచ్చి లేసి చితక్కొట్టేశారు. పోలీసులు వచ్చి కాపాడాలని ప్రయత్నించగా వాళ్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటన తూర్పు మేదినీపూర్ జిల్లా కాంటాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడి స్థానికుడైన ప్రభాకర్ అనే వ్యక్తి, ఓ స్మశానవాటికలోని సమాధిని తవ్వి ఏడేళ్ల క్రితం పూడ్చిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. అది పూర్తిగా అస్తిపంజరంగా మారి ఉంది. ఆ ఎముకలను ఓ చెట్టుకు వేలాడదీయడంతో పాటు దాంతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించాడు.
ప్రభాకర్ అనే వ్యక్తి ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని పక్కనే మద్యం బాటిల్ కనిపించిన నేపథ్యంలో, ప్రభాకర్ మద్యం మత్తులోనే ఈ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం ప్రకారం అతడు ఒక హోటల్లో పని చేసేవాడు. అయితే అతడి మద్యం అలవాటు వల్లే ఉద్యోగం కోల్పోయాడని తెలుస్తోంది. అయితే మహిళ మృతదేహాన్ని ఎందుకు తవ్వి బయటకు తీసాడన్న విషయంపై ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు. కాని స్థానికులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసమే ఈ పని చేశాడంటున్నారు.